పంజాబ్ లో మరో పథకాన్ని ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్. రాష్ట్రంలో ప్రతినెలా 300 యూనిట్ల మేర ఉచిత విద్యుత్ ను అందజేస్తామని.. ఇది శుక్రవారం నుంచి అమల్లోకి వస్తుందని సీఎం ప్రకటించారు. 

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విప్లవాత్మక నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు పంజాబ్ (Punjab) సీఎం భగవంత్ మాన్ (bhagwant mann) . తాజాగా ఆయన మరో ప్రకటన చేశారు. రాష్ట్రంలో నివాస గృహాలకు ప్రతి నెల 300 యూనిట్ల మేర విద్యుత్ ను ఉచితంగా ఇస్తామని సీఎం వెల్లడించారు. శుక్రవారం నుంచే ఈ ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి వస్తుందని భగవంత్ మాన్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ట్వీట్ చేసిన ముఖ్యమంత్రి.. గతంలో రాష్ట్రాన్ని పాలించిన పార్టీలు హామీలు ఇచ్చినా అమలు చేసేవి కావని దుయ్యబట్టారు. కానీ తమ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటోందని భగవంత్ మాన్ తెలిపారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

మరోవైపు ఉచిత విద్యుత్ పథకంపై ఆప్ (aap) నేత, ఎంపీ గౌరవ్ చద్దా హర్షం వ్యక్తం చేశారు. దేశంలో నివాస గృహాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం ఢిల్లీ తర్వాత పంజాబేనని తెలిపారు. పంజాబ్ ప్రజలకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చిందని గౌరవ్ అన్నారు. ఈ పథకం అమలు చేయడం వల్ల పంజాబ్ ప్రభుత్వ ఖజానాపై రూ.1,800 కోట్ల భారం పడుతుందని ఆ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హర్పాల్ సింగ్ తెలిపారు. 

ఇకపోతే.. నిన్న పంజాబ్ అసెంబ్లీలో సీఎం భగవంత్ మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని అమాయక ప్రజల నుండి దోచుకున్న ప్రతి పైసా ను అవినీతి రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్ల నుండి తిరిగి రిక‌వ‌రీ చేస్తామ‌ని అన్నారు. పంజాబ్, పంజాబీలకు వ్యతిరేకంగా అవినీతికి పాల్పడిన రాజకీయ నాయకులు ఏ రాజకీయ పార్టీలో చేరినప్పటికీ, వారి పాపాలకు ఆప్ ప్రభుత్వం ఎప్పటికీ క్షమించదని మన్ అన్నారు. 

ALso REad:Punjab CM Bhagwant Mann: "ప్రజల నుంచి దోచుకున్న ప్రతి పైసాను రికవరీ చేస్తాం": పంజాబ్ సీఎం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఇదిలా ఉంటే.. పంజాబ్ మహిళలకు రూ. 1,000 ఆర్థిక సహాయం రూపంలో అందిస్తామ‌న్న ఎన్నికల హామీని త్వరలో అమలు చేస్తామ‌ని మాన్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వనరుల సమీకరణ ప్రక్రియలో ఉందని, ఆ ప్ర‌క్రియ‌ పూర్తయితే.. త్వరలోనే ఈ హామీ నెరవేరుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భగవంత్ మాన్ అన్నారు.

ఆర్థిక మంత్రి హర్పాల్ చీమా సమర్పించిన బడ్జెట్‌పై చర్చను ముగించిన మన్, ప్రజా ధనాన్ని దోచుకున్న ఎవరైనా దాని కోసం చెల్లించాల్సి ఉంటుందని, రాష్ట్ర‌ప్ర‌భుత్వం ఎవ్వ‌రిని విడిచి పెట్టద‌ని, అవ‌స‌ర‌మైతే.. కటకటాల వెనక్కి నెట్టడానికి కూడా ఆలోచించ‌ద‌ని అన్నారు. అవినీతి నేత‌ల బినామీ ఆస్తులు, వారి బాగోతాల‌ను ప్రజల ముందు బయటపెడతామని, తద్వారా ఇతరులు ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా అడ్డుకుంటామన్నారు. రాష్ట్ర సంపదను దోచుకున్న వారు.. తాజాగా తమ అక్రమాలకు స్వర్గధామం కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారని ఆయన అన్నారు.