నేను సంతోషంగా లేను.. నాకు ప్రశాంతత కావాలి.. అని సూసైడ్ నోట్ రాసి ఓ మోడల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ముంబైలోని ఓ హోటల్ గదిలో ఈ ఘటన చోటు చేసుకుంది.  

న్యూఢిల్లీ : ముంబైలోని ఓ హోటల్ లో మోడల్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. గురువారం ముంబైలోని అంధేరీ ప్రాంతంలోని ఓ హోటల్ గదిలో ఫ్యాన్‌కు వేలాడుతున్న 30 ఏళ్ల మోడల్ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందగానే హోటల్ కు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు. అలాగే, వెర్సోవా పోలీస్ స్టేషన్ లో ఈ మరణం మీద యాక్సిడెంటల్ డెత్ గా నమోదు చేశారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మోడల్ బుధవారం రాత్రి 8 గంటల సమయంలో హోటల్‌లో చెక్ ఇన్ అయ్యింది. రాత్రికి డిన్నర్ కూడా ఆర్డర్ చేసింది. ఆ తరువాత గురువారం హౌస్ కీపింగ్ సిబ్బంది పలుమార్లు ఫోన్ చేసినా ఆమె తలుపు తీయలేదు. దీంతో హోటల్ మేనేజర్ పోలీసులకు సమాచారం అందించారు. హోటల్‌కు చేరుకున్న పోలీసులు మాస్టర్‌ కీతో గదిని తెరిచి చూడగా మోడల్‌ మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. 

అయితే, ఘటనా స్థలంలో పోలీసులు సూసైడ్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. "నన్ను క్షమించండి. నా ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కాదు. నేను సంతోషంగా లేను. నాకు మనశ్శాంతి కావాలి" అని నోట్ లో రాసింది.