బాలుడ్ని రక్షించబోయి బావిలో పడిన 30 మంది: ముగ్గురు మృతి
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విదిశ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ బాలుడుని రక్షించబోయి దాదాపు 30 మంది బావిలో పడిపోయారు. ఈ ఘటనలో ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది.
భోపాల్: ఓ బాలుడిని రక్షించబోయి 30 మంది బావిలో పడ్డారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విదిశలో గురువారం ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బావిలో పడిన బాలుడిని రక్షించడానికి గ్రామస్తులు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో 30 మంది బావిలో పడ్డారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది.
బాలుడిని రక్షించడానికి ప్రయత్నించినవారి బరువుకు తట్టుకోలేక బావి కప్పు కూలిపోయింది. దీంతో వారంతా బావిలో పడ్డారు. విదిశకు 50 కిలోమీటర్ల దూరంలో గల గంజ్ బసోడా గ్రామంలో ఈ ప్రమాదం సంభవించింది. రాత్రంతా సహాయక చర్యలు కొనసాగుతూ వచ్చాయి.
బావిలో పడిన 20 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. మరో పది మంది ఇంకా బావిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, సంబంధిత అధికారులతో తాను ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నానని ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ చెప్పారు.
నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ బలగాలు, రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్ మెంట్ బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. జోన్ ఇన్ స్పెక్టర్ జనరల్, ఇతర సీనియర్ అధికారుు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. బాధితులకు సరైన వైద్యం అందేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.