ఉద్యోగం పోతుందని భయం.. నెలల చిన్నారిని నదిలో పడేసి, హత్య చేసిన తల్లిదండ్రులు..
ఉద్యోగం పోతుందన్న భయంతో ఓ తల్లిదండ్రులు అత్యంత పాశవికంగా వ్యవహరించారు. తమ 3 నెలల చిన్నారిని కాలువలో పడేసి, చంపేశారు.
రాజస్థాన్ : ఉద్యోగం కోసం ఓ తల్లిదండ్రులు దారుణానికి తెగించారు. నవ మాసాలు మోసి కన్న చిన్నారిని అత్యంత కర్కషంగా కాలువలో పడేశారు. ఈ అమానుష ఘటన రాజస్థాన్లోని బికనేర్లో చోటు చేసుకుంది. కన్న తల్లిదండ్రుల ఈ దారుణానికి తెగించడంతో విషయం తెలిసిన వారంతా అవాక్కవుతున్నారు. చిన్నారిని కాలువలో పడేయడం గమనించిన స్థానికులు ఘటనా స్థలికి చేరుకునేసరికి ఆ తల్లిదండ్రులు అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే చిన్నారిని బయటికి తీసేలోపే మృతి చెందింది.
ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే… రాజస్థాన్లోని బికానెర్ లో ఓ తల్లిదండ్రులు తమ మూడు నెలల చిన్నారిని సమీపంలో ఉన్న కాలువలో పడేశారు. దంపతులు కాలువ దగ్గరికి రావడం.. అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతుండడం.. గమనించిన స్థానికులు అక్కడికి చేరుకునేసరికి చిన్నారిని కాలువలో పడేసి వారు పారిపోయారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని.. కాలువలో పడేసిన చిన్నారి గురించి వెతికి బయటకి తీశారు. అప్పటికే చిన్నారి మృతి చెందింది.
స్నేహితుడిని కలిసినందుకు శ్రద్దా వాకర్ ను హతమార్చిన అఫ్తాబ్ పూనావాలా : చార్జిషీట్ లో కీలక విషయాలు
ఈ దారుణానికి పాల్పడిన దంపతులు ఝన్వర్ లాల్, గీత లుగా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించే క్రమంలో వెలుగు చూసిన వాస్తవాలు విస్తు పోయేలా ఉన్నాయి. ‘ఝన్వర్ లాల్.. చందాసర్ లో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. అక్కడ అతను కాంట్రాక్టు ఉద్యోగిగా ఉన్నాడు. అయితే అతను తనకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారని.. ఉద్యోగంలో చేరే ముందు అఫిడవిట్ సమర్పించాడు. కానీ అతనికి ముగ్గురు పిల్లలు.
దీంతో.. ఈ విషయం తెలిస్తే తన ఉద్యోగం పోతుందని భయపడ్డారు. మూడో బిడ్డకు మూడు నెలల వయసు ఉంది. ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలిస్తే.. తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు ఉద్యోగం పోతుందని.. అది లేకపోతే బతుకుతెరువు కష్టమని భయపడ్డాడు. మూడో బిడ్డను ఎలాగైనా వదిలించుకోవాలనుకున్నారు. దీనికోసం దంపతులిద్దరూ దారుణమైన ఆలోచన చేశారు. మూడు నెలల ఆడబిడ్డను తీసుకువెళ్లి కాలువలో పడేసి చంపారు…అని పోలీసులు తెలిపారు.