స్వాతంత్య్ర దినోత్సవ వేళ విషాదం: జెండా కడుతుండగా విరిగిన క్రేన్.. ముగ్గురు సిబ్బంది దుర్మరణం
75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ నగరంలో విషాదం చోటు చేసుకుంది. ఇక్కడి చారిత్రక మహారాజా బడా తపాలా కార్యాలయం (పోస్టాఫీస్) భవనంపై జెండా ఏర్పాటు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ముగ్గురు సిబ్బంది మరణించారు.
75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని యావత్ దేశం వేడుకలకు సిద్ధమవుతోంది. మారు మూల పల్లెల నుంచి దేశ రాజధాని వరకు ప్రతి చోటా జెండా పండుగకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పనుల్లో అపశ్రుతి దొర్లి ముగ్గురు మున్సిపల్ సిబ్బంది మృతి చెందిన సంఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. గ్వాలియర్ నగరంలోని చారిత్రక మహారాజా బడా తపాలా కార్యాలయం (పోస్టాఫీస్) భవనంపై జెండా ఏర్పాటు చేస్తున్నారు కార్పోరేషన్ అధికారులు. ఈ క్రమంలో హైడ్రాలిక్ ఫైర్ బ్రిగేడ్ ట్రాలీతో భవనంపైకి ఎక్కిన సిబ్బంది జెండా ఏర్పాటు చేస్తుండగా ఒక్కసారిగా క్రేన్ విరిగిపడింది. దీంతో ట్రాలీ అదుపు తప్పి నలుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా... మరో ముగ్గురు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మిగతా ఇద్దరూ నిలకడగా ఉన్నారని అధికారులు తెలిపారు.
ALso Read:పంద్రాగస్టున భారత్తోపాటు స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే దేశాలివే..!
మరోవైపు ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జాతీయ పండుగ ఏర్పాట్లలో విషాదం అలుముకోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి తులసీరామ్ సిలావత్ ప్రకటించారు. ఈ ప్రమాదంపై విచారణ చేపట్టాలని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత కమల్నాథ్ డిమాండ్ చేశారు.