దారుణం.. విరిగిపడ్డ మంచు చరియలు.. ముగ్గురు జవాన్లు మృతి
జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో హిమపాతం కారణంగా భారత సైన్యానికి చెందిన 56 రాష్ట్రీయ రైఫిల్స్ (RR)కి చెందిన ముగ్గురు జవాన్లు శుక్రవారం మరణించారు. కుప్వారాలోని మచిల్ సెక్టార్లో పెట్రోలింగ్ పార్టీపై హిమపాతం పడింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మరణించారు.
జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో శుక్రవారం నాడు హిమపాతం సంభవించి ముగ్గురు సైనిక సిబ్బంది మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భారత సైన్యానికి చెందిన 56 రాష్ట్రీయ రైఫిల్స్ (RR)కి చెందిన ముగ్గురు జవాన్లు మచిల్ సెక్టార్లో విధులు నిర్వహిస్తున్నారు. వారు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఆకస్మిక హిమపాతం కారణంగా ముగ్గురూ సమాధి అయ్యారు. వారిని బయటకు తీసే సమయానికి వారు ప్రాణాలు కోల్పోయారు. వీరమరణం పొందిన సైనికులను గన్నర్ సౌవిక్ హజ్రా (22), లాన్స్ నాయక్ ముఖేష్ కుమార్ (22), నాయక్ గైక్వాడ్ మనోజ్ లక్ష్మణ్ రావు (45)గా గుర్తించారు. వారి మృతదేహాలను డ్రగ్ముల్లాలోని సైనిక ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ట్విట్టర్లో తన సంతాపాన్ని తెలియజేసారు. వారి అత్యున్నత త్యాగానికి దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని తెలిపారు. కుప్వారా జిల్లా SSP యుగల్ మన్హాస్ మాట్లాడుతూ..మచిల్ సెక్టార్లోని అల్మోరా పోస్ట్ సమీపంలో శుక్రవారం పెట్రోలింగ్ బృందానికి అకస్మాత్తుగా హిమపాతం సంభవించిందని సైనిక ప్రతినిధి తెలిపారు. అందులో ముగ్గురు జవాన్లు సమాధి అయ్యారు. హిమపాతంలో చిక్కుకున్న సమాచారం అందుకున్న సైన్యం వెంటనే భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ముగ్గురు సైనికులను మంచు నుండి బయటకు తీశారు. కానీ అప్పటికి వారు మరణించారు. వీర మరణం పొందిన సైనికులు 56 రాష్ట్రీయ రైఫిల్స్ (RR) చేసిన వారని తెలిపారు.