ఉత్తరాఖండ్లో భారీ హిమపాతం.. చిక్కుకుపోయిన 28 మంది పర్వతారోహకులు.. పలువురు మృతి
ఉత్తరాఖండ్లోని భారీ హిమపాతం సంభవించింది. ద్రౌపది దండ-2 పర్వత శిఖరంలో సంభవించిన హిమపాతంలో 28 మంది పర్వతారోహకులు చిక్కుకుపోయారు. వీరిలో పలువురు మృతిచెందినట్టుగా తెలుస్తోంది.
ఉత్తరాఖండ్లోని భారీ హిమపాతం సంభవించింది. ద్రౌపది దండ-2 పర్వత శిఖరంలో సంభవించిన హిమపాతంలో 28 మంది పర్వతారోహకులు చిక్కుకుపోయారు. వీరిలో పలువురు మృతిచెందినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీపీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో మాట్లాడినట్టుగా పుష్కర్ సింగ్ ధామి చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ను వేగవంతం చేయడానికి సైన్యం సహాయం కోరినట్టుగా చెప్పారు. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి సాధ్యమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని రాజ్నాథ్ సింగ్ చెప్పినట్టుగా పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. అందరినీ రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసగుతుందని చెప్పారు.
ఉత్తరకాశీలోని నెహ్రూ మౌంటెనీరింగ్ ఇనిస్టిట్యూట్కు చెందిన 28 మంది ట్రైనీలు ద్రౌపది దండ-2 పర్వత శిఖరంలో హిమపాతం కారణంగా చిక్కుకున్నట్లు సమాచారం అందింది. హిమపాతంలో చిక్కుకున్న ట్రైనీలను వీలైనంత త్వరగా రక్షించడానికి ఎన్ఐఎం బృందంతో పాటు జిల్లా యంత్రాంగం, సైన్యం, ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీపీ సిబ్బంది త్వరితగతిన సహాయక చర్యలను నిర్వహిస్తున్నారని పుష్పర్ సింగ్ తెలిపారు.
ఈ ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్.. ఉత్తరకాశీలోని నెహ్రూ మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్ చేపట్టిన పర్వతారోహణ యాత్రలో కొండచరియలు విరిగిపడి విలువైన ప్రాణాలను కోల్పోవడం తీవ్ర వేదనకు గురిచేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి అని తెలిపారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామితో మాట్లాడి పరిస్థితిని సమీక్షించినట్టుగా చెప్పారు. అక్కడ చిక్కుకున్న పర్వతారోహకులను ఆదుకునేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్ను విస్తృతం చేయమని IAFని ఆదేశించినట్టుగా చెప్పారు. అందరి భద్రత, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నట్టుగా తెలిపారు.