మధ్యప్రదేశ్లో గాల్లోకి కాల్పులు: మహిళకు గాయాలు, రంగంలోకి పోలీసులు
రోడ్లమీద తిరిగితే కాల్చి పడేస్తామంటూ తుపాకులు చేతబట్టుకొని ఆకతాయిలు వీరంగం సృష్టించారు. రోడ్లపై బైక్లపై తిరుగుతూ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ మహిళ గాయపడింది.
భోపాల్: రోడ్లమీద తిరిగితే కాల్చి పడేస్తామంటూ తుపాకులు చేతబట్టుకొని ఆకతాయిలు వీరంగం సృష్టించారు. రోడ్లపై బైక్లపై తిరుగుతూ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ మహిళ గాయపడింది. రాష్ట్రంలోని మొరానా జిల్లా బంఖండి ప్రాంతంలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని దుండగులు 25 బైక్ ల మీద రోడ్లపై తిరుగుతూ గాల్లోకి కాల్పులు జరిపారు. తమను గుర్తించకుండా గాల్లోకి కాల్పులు జరిపారు.
బైక్పై డ్రైవ్ చేసుకుంటూ 100 రౌండ్లు గాల్లో కాల్పులు జరిపారు. తుపాకీ గుళ్ల శబ్దంతో ఉలిక్కిపడ్డ ప్రజలు ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఇష్టారీతిలో కాల్పులు జరపడంతో కొన్ని ఇళ్లు కూడ ధ్వంసమయ్యాయి. ఈ సమాచారం అందుకొన్న తర్వాత అడిషనల్ ఎస్పీ రాయ్ సింగ్ ఘటన స్థలానికి చేరుకొన్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
కాల్పులకు పాల్పడ్డ నిందితుల్ని అదుపులోకి తీసుకున్నాం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.
అయితే ఈ విషయమై మరో వాదన ప్రచారంలో ఉంది. ఓ వర్గం వారిని లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో కాల్పుల ఘటన చోటు చేసుకొందనే ప్రచారం కూడ సాగుతోంది.