India Pakistan War : దేశవ్యాప్తంగా 24 విమానాశ్రయాలు మూసివేత... ఎప్పటివరకో తెలుసా?

Synopsis
భారత్ పై దాడికి పాక్ సైన్యం 400 డ్రోన్లను మోహరించగా భారత సైన్యం వాటిని కూల్చివేసింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా 24 విమానాశ్రయాలను మూసివేసారు. ఈ ఎయిర్ పోర్ట్స్ ఏవి? ఎన్నిరోజులు మూసేస్తారు? ఇక్కడ తెలుసుకుందాం.
India Pakistan War: పాకిస్తాన్ డ్రోన్, క్షిపణి దాడుల నేపథ్యంలో భారతదేశంలో భద్రతా అలర్ట్ పెంచారు. 24 విమానాశ్రయాలు మే 15 ఉదయం 5:29 వరకు మూసివేయబడతాయని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. పాకిస్తాన్ వైపు నుంచి జరిగిన వైమానిక చొరబాట్లు, డ్రోన్ దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇండిగో, ఎయిర్ ఇండియా ప్రయాణ హెచ్చరిక
ప్రభావిత విమానాశ్రయాల నుండి రాకపోకలు సాగింగే అన్ని విమానాలు మే 15 ఉదయం 5:29 వరకు రద్దు చేయబడతాయని ఇండిగో ఎయిర్లైన్స్ తన ప్రకటనలో తెలిపింది.ప్రయాణికుల భద్రత తమ ప్రాధాన్యత అని పేర్కొంది. మూసివేసిన విమానాశ్రయాలలో శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, ధర్మశాల, బికానెర్, రాజ్కోట్, జోధ్పూర్, కిషన్గఢ్ ఉన్నాయి.
జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్నగర్, రాజ్కోట్ నుండి విమానాలు మే 15 ఉదయం వరకు రద్దు చేయబడుతున్నాయని ఎయిర్ ఇండియా కూడా సోషల్ మీడియా వేదిక Xలో సమాచారం ఇచ్చింది. ప్రభావిత ప్రయాణికులకు ఉచిత రీఫండ్ లేదా ఎలాంటి ఛార్జీలు లేకుండా రీషెడ్యూల్ సౌకర్యం కల్పిస్తారు.
భారత్ పై దాడికి పాకిస్తాన్ డ్రోన్లు
గురువారం రాత్రి పాకిస్తాన్ భారతదేశ పశ్చిమ సరిహద్దులో భారీ చొరబాటుకు ప్రయత్నించిందని భారత సైన్యం శుక్రవారం ప్రెస్ బ్రీఫింగ్లో వెల్లడించింది. 36 వేర్వేరు ప్రదేశాలలో దాదాపు 300-400 డ్రోన్లను మోహరించారని సైన్యం ప్రతినిధి కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. వీటిలో చాలా వాటిని భారత సైన్యం ‘కైనెటిక్’, ‘నాన్-కైనెటిక్’ పద్ధతుల ద్వారా కూల్చివేసింది.
డ్రోన్ శిథిలాలను పరిశీలించగా అవి టర్కీకి చెందిన అసిస్గార్డ్ సోంగర్ మోడల్వి అని, వీటిని పాకిస్తాన్ భారత వైమానిక రక్షణ బలాన్ని పరీక్షించడానికి, గూఢచర్యం కోసం ఉపయోగించిందని తేలింది.
జమ్మూలో హమాస్ తరహా క్షిపణి దాడి
ఇజ్రాయెల్పై జరిగిన దాడులను పోలి ఉండే హమాస్ తరహా క్షిపణి దాడిని జమ్మూలో పాకిస్తాన్ ప్రయత్నించింది. ఈ దాడులు భారతదేశం ‘ఆపరేషన్ సింధూర్’కు ప్రతిస్పందనగా భావిస్తున్నారు. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా మే 8న పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది.