బిర్యానీ ఆర్డర్ విషయంలో చెలరేగిన గొడవ ఓ యువకుడి ప్రాణాలు బలి తీసుకుంది. నడిరోడ్డులో అత్యంత దారుణంగా కొడవళ్లతో దాడి చేసి హత్య చేశారు.
చెన్నై : తమిళనాడులోని చెన్నైలో ఓ షాకింగ్ వీడియో వెలుగు చూసింది. ఓ యువకుడిని బిర్యానీ కోసం ముగ్గురు యువకులు దారుణంగా కొడవళ్లతో దాడిచేసి హత్య చేశారు. దీనికి సంబంధించిన సీసీ టీవీ వీడియో వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.
ఈ ఘటనకు చెందిన వివరాల్లోకి వెడితే..బిర్యానీ కోసం జరిగిన ఘర్షణలో శనివారం 22 ఏళ్ల యువకుడిని ముగ్గురు వ్యక్తులు నరికి చంపారు. మృతుడిని బాలాజీగా గుర్తించారు. బాలాజీ చెన్నైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. శనివారం నాడు స్నేహితులతో కలిసి మన్నూర్పేట బస్టాప్ సమీపంలోని హోటల్ కు భోజనానికి వెళ్లాడు.
ఢిల్లీ అత్యాచారం కేసు : నిందితుడితో పాటు సహకరించిన భార్య అరెస్ట్.. బాధిత బాలిక వాంగ్మూలం నమోదు..
వారు బిర్యానీ కొంటుండగా, అదే దుకాణంలో ముగ్గురు తాగుబోతులు డిష్ ఆర్డర్ చేశారు. అయితే, దుకాణం యజమాని బాలాజీవాళ్లకు మొదట ఫుడ్ ఆర్డర్ ఇవ్వడంతో.. తాగుబోతులు బాలాజీతో గొడవ పడ్డారు.
మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు బాలాజీపై కొడవళ్లతో దాడి చేశారు. అతను వదిలిపెట్టమని అరుస్తున్నా..వినలేదు. గట్టిగా కేకలు వేస్తూ.. కొడవలితో రోడ్డుమీద వచ్చిపోయేవారిని బెదిరిస్తూ వీరంగం సృష్టించారు. వారిని చూసిన పాదచారులు, వాహనదారులు భయంతో పరుగులు తీశారు. ఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
ఈ ఘటన మీద కొందరు అధికారులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకునే సరికే ముగ్గురు నిందితులు పారిపోయారు. తీవ్రంగా గాయపడిన బాలాజీని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, ఈ కేసులో ముగ్గురు నిందితులను చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ జరుపుతున్నారు.
