ఒడిషాలో మరో లఖీంపూర్ ఖేరీ ఘటన.. జనంపైకి కారును నడిపిన ఎమ్మెల్యే, 20 మందికి గాయాలు
ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ ఖేరిని పోలిన ఘటనే ఒడిషాలోనూ చోటు చేసుకుంది. బీజేడీ ఎమ్మెల్యే ప్రశాంత్ జగదేవ్ తన ఇంటి వద్దకు చేరున్న వారిపైకి కారును నడిపారు. ఈ ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలను (farm laws) వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్లో (lakhimpur kheri case) ఆందోళన చేస్తున్న రైతుల మీదకు కేంద్ర మంత్రి కుమారుడు ఆశీష్ మిశ్రా కారు (ashish mishra) నడిపిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో అన్నదాతలు భగ్గుమన్నారు. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించడంతో కేంద్రంలోని బీజేపీ సర్కారుతో పాటు యోగి ప్రభుత్వంపైనా పెద్ద ఎత్తున విమర్శలు రేకెత్తాయి.
సరిగ్గా అదే తరహాలో ఇప్పుడు ఒడిశాలోనూ ఓ ఘటన చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో ఏడుగురు పోలీసులు సహా 20 మందికిపైగా తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. అధికార బిజూ జనతాదళ్కు (biju janata dal) చెందిన ఎమ్మెల్యే ప్రశాంత్ జగదేవ్ (prashant jagdev) ఇటీవలే సస్పెన్షన్కు గురయ్యారు. ఈ క్రమంలో శనివారం ఉదయం తన ఇంటి వద్దకు భారీగా చేరుకున్న జనం మీదకు ఆయన తన కారును ఎక్కించారు. ఈ ఘటనలో బీజేడీకి చెందిన ఓ కార్యకర్త సహా 15 మంది బీజేపీ కార్యకర్తలు, ఏడుగురు పోలీసు సిబ్బంది గాయపడ్దారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై పోలీసులు విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జనం.. ఎమ్మెల్యేపై దాడికి దిగారు. ఆయన వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. ఘటనా సమయంలో ఎమ్మెల్యే మద్యం మత్తులో వున్నారని స్థానికులు అంటున్నారు. జనం దాడిలో గాయపడిన ఎమ్మెల్యే ప్రశాంత్ను భువనేశ్వర్లోని ఆసుపత్రికి తరలించారు.
కాగా.. సాగు చట్టాల రద్దుకు ముందే యూపీలో నిర్వహించిన ఓ సభకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు చేస్తుండగా వారిపై నుంచి వాహనాలు దూసుకెళ్లడంతో రైతులు మరణించిన ఘటన తెలిసిందే. ఆ ఘటనలో ప్రధాన నిందితుడిగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా(Minister Ajay Mishra) కొడుకు అశిశ్ మిశ్రా (Ashish Mishra) ఉన్నారు. మరణించిన రైతు కుటుంబాలకు న్యాయం జరగాలని అప్పుడే రైతులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా, ఈ కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు అశిశ్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ మంజూరు మరణించిన రైతుల కుటుంబాలకు ఆగ్రహం తెప్పించింది. తమ ఆప్తులకు న్యాయం జరగాలని వారు ఆందోళనలో మునిగారు. ఈ నేపథ్యంలోనే వారు కేంద్ర ప్రభుత్వానికి మరో సవాల్ తెచ్చిపెట్టినట్టుగా తోస్తున్నది. చార్జిషీటులో కేంద్ర మంత్రి పుత్రుడు అశిశ్ మిశ్రాపై బలమైన నేరారోపణలు, ఆధారాలు ఉన్నప్పటికీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్తో వారు ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో వేయించారు.
ముద్దాయి చేసిన దారుణమైన నేరాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్లు వాదించారు. చార్జిషీటులోని నిందితుడిపై ఉన్న బలమైన ఆధారాలు, ఆయన హోదా, పొజిషన్ వంటివి తమకు ఆందోళనకరంగా ఉన్నాయని పిటిషన్లో రైతుల కుటుంబాలు పేర్కొన్నాయి. ఆయన న్యాయ వ్యవస్థ నుంచి పారిపోయే ప్రమాదం ఉన్నదని, న్యాయాన్ని అడ్డుకోవడం, సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆరోపించాయి.