మాలేగావ్ పేలుళ్లు.. నిందితులపై ఉగ్రకుట్ర అభియోగం
లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ సహా నిందితులపై ఉగ్ర కుట్ర, హత్యానేరంతో పాటు పలు అభియోగాలను నమోదు చేసింది.
2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో మొత్తం ఏడుగురు నిందితులపైనా ఎన్ఐఏ కోర్టు అభియోగాలు నమోదు చేసింది. లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ సహా నిందితులపై ఉగ్ర కుట్ర, హత్యానేరంతో పాటు పలు అభియోగాలను నమోదు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను నవంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది.
ఇదిలా ఉండగా.. తమపై వచ్చిన అభియోగాల నమోదు వాయిదా వేయాలంటూ పురోహిత్ ఈ రోజు ఉదయం న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు. కాగా.. దానిని ప్రత్యేక ధర్మాసనం తిరస్కరించింది. ట్రయల్ కోర్టు అభియోగాలు మోపిన కొద్ది సేపటికే ఏడుగురు నిందితులు తాము నేరం చేయలేదంటూ కోర్టుకు విన్నవించారు.
కాగా ట్రయల్ కోర్టులో అభియోగాల నమోదు వాయిదా వేయాలంటూ నిన్న దాఖలైన పిటిషన్లను బోంబే హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. అయితే తనపై చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (యూఏపీఏ) కింద విచారణ జరపడాన్ని సవాల్ చేస్తూ పురోహిత్ పెట్టుకున్న పిటిషన్పై వచ్చే నెల 21న విచారణ చేపట్టేందుకు అంగీకరించింది. ఈ మేరకు పురోహిత్ దాఖలు చేసిన పిటిషన్పై సమాధానం చెప్పాలంటూ ఎన్ఐఏ కౌన్సిల్ సందేశ్ పాటిల్కు ఆదేశాలు జారీ చేసింది.