ఇంటి బయట ఆడుకుంటూ.. ప్రమాదవశాత్తు రెండేండ్ల చిన్నారి 200 అడుగుల బోరుబావిలో  పడిపోయింది. దాదాపు 7 గంట‌ల‌పాటు తీవ్రంగా శ్ర‌మించి ఆ చిన్నారిని ప్రాణాల‌తో బ‌య‌ట‌కు తీశారు. ఈ ఘటన రాజస్థాన్​ దౌసా జస్సాపడ గ్రామంలో గురువారం జరిగింది. 

పూడ్చకుండా వదిలేసిన బోరుబావులు చిన్నారుల పాలిట‌ మృత్యుకుహారాలుగా మారుతున్నాయి. అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోతే.. అవి ప‌సివారి ప్రాణాల‌ను మింగేస్తున్నాయి. బోరుబావిలో ప‌లుమార్లు చిన్నారులు ప‌డిన ఘ‌ట‌న‌లు ఎన్నో జ‌రిగినా.. ప్రభుత్వాలు, పోలీసులు ఎంత హెచ్చరించినా ప్రజల్లో మార్పురావడం లేదు. వాటిని వూడ్చకుండానే వదిలేస్తున్నారు. అది గమనించని చిన్నారులు.. సరదాగా ఆడుకుంటూ వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారు.

ఇలాంటి సంద‌ర్భంలో చిన్నారుల ప్రాణాలను కాపాడినా ఘ‌ట‌న‌ల కంటే.. అధిక శాతం ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న‌లే ఉన్నాయి. తాజాగా రాజ‌స్థాన్ లో ఇలాంటి ఘటనే జరిగింది. రెండేండ్ల చిన్నారి ప్రమాదవశాత్తు 200 అడుగుల బోరుబావిలో పడిపోయింది. ఈ ఘటన రాజస్థాన్​ లోని దౌసా జిల్లా జస్సాపడ మండ‌లంలోని ఓ గ్రామంలో గురువారం జరిగింది.

సమాచారం ప్రకారం అభనేరి గ్రామంలోని దేవ్‌నారాయణ్ గుర్జర్ రెండేళ్ల కుమార్తె అంకిత ఉదయం 11 గంటల సమయంలో ఇంటి బయట ఆడుకుంటోంది. ఈ క్రమంలో ఇంటి పక్కనే ఉన్న తెరిచి ఉన్న బోరుబావిలో పడింది. కొంత కాలంగా ఆ విషయం కుటుంబ సభ్యులకు తెలియలేదు. కొంతసేపటికి చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. ఇంతలో బోరుబావిలోంచి ఏడుపు వినిపించింది. బాలిక బోరుబావిలో పడిందన్న సమాచారం అందిన వెంటనే కలకలం రేగింది. స్థానికులు వెంట‌నే అధికారుల‌కు స‌మాచారం అందించారు.

వెంట‌నే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని.. ఆ చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సీసీటీవీ కెమెరాలో బాలిక దాదాపు 100 అడుగుల లోతులో ఇరుక్కుపోయి కనిపించింది. జేసీబీ యంత్రాలు, ట్రాక్టర్లను పంపించి సహాయక చర్యలు చేపట్టారు. మ‌రోవైపు ఆ చిన్నారికి ఆక్సిజన్ అందజేశారు. బాలికను రక్షించే పనిలో ఎస్​డీఆర్​ఎఫ్ సిబ్బంది, పరిపాలన బృందాలు తీవ్రంగా శ్ర‌మించాయి. 7 గంటలకు పైగా శ్రమించి అధికారులు ఆ చిన్నారిని సుర‌క్షితంగా కాపాడి.. బయటకు తీశారు. 

క్లుప్తంగా... 

ఉదయం 11 గంటల సమయంలో బాలిక బోరుబావిలో పడిపోయింది. సమాచారం అందిన వెంటనే పోలీసులకు, అధికారులకు సమాచారం అందించారు. 11:45 గంటలకు జేసీబీ అక్కడికి చేరుకోగా.. 12 గంటలకు తహసీల్దార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు గంటన్నర తర్వాత 12:30 గంటలకు బోరుబావిలో ఉన్న బాలికకు ఆక్సిజన్ అందించారు. వర్షం రావడంతో రెస్క్యూ ఆపరేషన్‌ను ఆపాల్సి వచ్చింది. 1:30 గంటలకు వర్షం ఆగిన తర్వాత, SDRF బృందం సహాయక చర్యలను ప్రారంభించింది. 2 గంటల తర్వాత అమ్మాయికి కెమెరా డెలివరీ అయింది. సాయంత్రం 7 ప్రాంతంలో చిన్నారిని సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసిన అధికారులు.