శబరిమల.. మరో ఇద్దరు మహిళలను అడ్డుకున్న ఆందోళనకారులు
శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు వెళ్లిన మరో ఇద్దరు మహిళలకు భంగపాటు ఎదురైంది
శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు వెళ్లిన మరో ఇద్దరు మహిళలకు భంగపాటు ఎదురైంది. శబరిమల కొండకు మరో కిలోమీటరు దూరం ఉందనగా.. ఆ ఇద్దరు మహిళలను ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో.. ఆ ఇద్దరు మహిళలు వెనుదిరగాల్సి వచ్చింది.
పంబా నదీ సమీపంలోనే ఆ ఇద్దరు మహిళలను ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో.. వారిద్దరూ నిరాశతో వెనుదిరిగారు. పోలీసుల బృందం రక్షణతో వెళ్లినప్పటికీ.. ఆందోళనకారులు వారిని అడ్డుకోవడం గమనార్హం.
ఆదివారం తమిళనాడుకు చెందిన మనితి సంస్థ మహిళల బృందం కూడా శబరిమల వెళ్లేందుకు ప్రయత్నించారు. 11మంది మహిళల బృందం పంబా బేస్ క్యాంప్ చేరుకోవడంతో.. వారిని ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 50ఏళ్లలోపు మహిళలు ఆలయంలోకి అడుగుపెట్టడానికి వీలులేదంటూ.. వారు ఆందోళన చేయడంతో.. మహిళలు వెనుదిరగక తప్పలేదు.
రానున్న రోజుల్లో మరో 40మందికి పైగా మహిళలు శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా.. వారు లోపలికి వెళ్లాలని ప్రయత్నించడం.. వాళ్లను ఆందోళన కారులు అడ్డుకోవడం జరుగుతుందని.. అలాంటి సమయంలో ఘర్షణలు ఎక్కువగా జరుగుతాయని.. అందుకే పోలీసు భద్రత మరింత పెంచాలని వారు కోరుతున్నారు.