ఓటర్ల డేటా చోరీ.. ఇద్దరు ఐఏఎస్ అధికారులను సస్పెండ్ చేసిన కర్ణాటక ప్రభుత్వం
ఓటర్ల డేటా చోరీ జరిగిందని ఎన్నికల సంఘానికి నవంబర్ 17వ తేదీన కొన్ని ఆరోపణలు చేరాయి. ఈ నేపథ్యంలోనే తమ ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేస్తామని సీఎం బసవరాజ్ బొమ్మై హామీ ఇచ్చారు. ఈ తరుణంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది.
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం ఇద్దరు ఐఏఎస్ అధికారులను ఓటర్ల డేటా చోరీ ఆరోపణలపై సస్పెండ్ చేసింది. బెంగళూరు అర్బన్ డిప్యూటీ కమిషనర్ కే శ్రీనివాస్, బీబీఎంపీ స్పెషల్ కమిషనరర్ ఎస్ రంగప్పలను కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఓటర్ల డేటా చోరీ ఆరోపణలపై నిష్పాక్షిక దర్యాప్తు చేపడుతామని సీఎం బసవరాజు బొమ్మై హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కమిషన్ డైరెక్టివ్లకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
అవగాహన కార్యక్రమాల పేరిట ఓటర్ల డేటాను చోరీ చేస్తున్నట్టు ఓ ఎన్జీవో పై ఆరోపణలు వచ్చాయి. అవగాహన కార్యక్రమాలనే పేరుతో ఎన్జీవో చిలుమే ఎడ్యుకేషనల్ కల్చరల్, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ బృహత్ బెంగళూరు మహానగర పాలికే ఏరియాలో ఇంటింటా సర్వే చేస్తూ ఓటర్ల డేటాను దొంగిలించినట్టు ఎన్నికల కమిషన్కు రిపోర్టులు అందాయి. నవంబర్ 17న ఈ రిపోర్ట్స్ చేరాయి.
సస్పెన్షన్ వేటుకు గురైన ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఇంచార్జీలుగా ఉన్న నియోజకవర్గాల్లో ఈ ఎలక్టోరల్ డేటా ఫ్రాడ్ పెద్ద ఎత్తున జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి.
Also Read: మంగళూరు బ్లాస్ట్: అద్దెకు దిగాలంటే పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ తప్పనిసరి.. ఉగ్ర భయంతో కొత్త రూల్
ఈ ఏడాది జనవరి 1వ తేదీ తర్వాత శివాజీ నగర్, చిక్పేట్, మహాదేవపుర నియోజకవర్గాల్లో ఎలక్టోరల్ రోల్స్ చేర్పులు, తొలగింపులను పరిశీలించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణ వివాదంపై నిష్పాక్షిక విధానంలో కర్ణాటక ప్రభుత్వం దర్యాప్తు చేపడుతుందని సీఎం బసవరాజ్ బొమ్మై హామీ ఇచ్చారు. ఏ అధికారి, సంస్థ, ఏజెన్సీ అయినా దోషులుగా తేలితే శిక్షిస్తామని స్పష్టం చేశారు.
కొన్ని చోట్ల ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయని, అలాంటి చోట్ల ఓటర్ల జాబితాను మళ్లీ సవరించాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుందని, దీన్ని తాము స్వాగతిస్తున్నామని సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. ఎన్నికలు నిష్పాక్షికంగా, స్వేచ్ఛగా జరగాల్సిందే అని వివరించారు. కాబట్టి, ఎన్నికల సంఘం నిర్ణయాలను తాము స్వాగతిస్తున్నామని తెలిపారు.