స్కూల్లో బాంబు పేలుడు..19మంది విద్యార్థులకు గాయాలు
జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలోని ఓ పాఠశాలలో బుధవారం బాంబు పేలుడు సంభవించింది
జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలోని ఓ పాఠశాలలో బుధవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 19మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. కాకపోరాలోని నర్బల్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది.
బాంబు పేలుడు సంభవించిన సమయంలో విద్యార్థులు వింటర్ ట్యూషన్ కి హాజరయ్యారు. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించిందని సంబంధిత అధికారులు తెలిపారు. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కొందరు విద్యార్థులను మాత్రం శ్రీనగర్ కి తరలించినట్లు చెప్పారు. అయితే.. పాఠశాలలోకి బాంబు ఎలా వచ్చిందనే విషయంపై అధికారులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.