కశ్మీర్ లోయలో తగ్గుముఖం పట్టిన ఉగ్రవాదం…! 172 మంది ఉగ్రవాదుల హతం..
కశ్మీర్ లోయలో 2022లో 42 మంది విదేశీ ఉగ్రవాదులతోపాటు మొత్తం 172 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని జమ్ము కశ్మీర్ అదనపు డీజీపీ విజయ్కుమార్ పేర్కొన్నారు. అదే సమయంలో ఉగ్రవాద సంస్థల్లో యువత చేరికలు 37 శాతం తగ్గుముఖం పట్టిందని తెలిపారు.
కశ్మీర్ లోయలో ఉగ్రవాదం తగ్గుముఖం పట్టిందని, ఉగ్ర చేరికలు తగ్గాయని జమ్ము కశ్మీర్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) కశ్మీర్ విజయ్ కుమార్ వెల్లడించారు. 2022లో భద్రతా బలగాలు జరిపిన యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లో 42 మంది విదేశీ ఉగ్రవాదులను హతమొదించామని తెలిపారు. మొత్తంగా 172 మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. ఏడాది వ్యవధిలో కాశ్మీర్లోని వివిధ ప్రాంతాల్లో 93 ఎన్కౌంటర్లు జరిగాయనీ, మరోవైపు ఉగ్రవాద సంస్థల్లో చేరుతున్న యువత సంఖ్య కూడా 37 శాతం తగ్గిందని తెలిపారు. కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు, భద్రతా బలగాల దాడులపై శనివారం ఆయన వరుస ట్వీట్లు చేశారు.
లోయలో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా ,ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్ఎఫ్)కి చెందిన 108 మంది ఉగ్రవాదులు హతమయ్యారని విజయ్ కుమార్ తెలిపారు. జైషే మహ్మద్కు చెందిన 35 మంది ఉగ్రవాదులు, హిజ్బుల్ ముజాహిదీన్ (హెచ్ఎం)కి చెందిన 22 మంది ఉగ్రవాదులు, ఆల్ బాద్ర్ చెందిన నలుగురు, అన్సార్ గజ్వాత్ ఉల్ హింద్ చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు.
అలాగే.. 2022లో జమ్మూ కాశ్మీర్ పోలీసు (జెకెపి)కి చెందిన 14 మంది సిబ్బందితో సహా 26 మంది భద్రతా సిబ్బంది ఉగ్రవాదుల ఎన్కౌంటర్లలో మరణించారని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఉగ్రవాదులు బాసిత్ దార్, ఆదిల్ వానీ మినహా నేరాలకు పాల్పడిన ఉగ్రవాదులందరినీ హతమార్చినట్లు ఏడీజీపీ తెలిపారు. అదే సమయంలో ఉగ్ర చేరికల గురించి కూడా ప్రస్తవించారు. ఈ ఏడాది 100 మంది యువకులు ఉగ్రవాద సంస్థల్లో చేరారనీ, గత ఏడాదితో పోలిస్తే ఇది 37 శాతం తక్కువ అని తెలిపారు. ఉగ్రవాద సంస్థల్లో చేరిన 65 మంది చనిపోగా, 17 మందిని అరెస్టు చేశామని చెప్పారు.18 మంది ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారని వివరించారు.
ఉగ్రదాడుల్లో 29 మంది పౌరుల హతం
ఈ ఏడాది లోయలో జరిగిన ఉగ్రదాడుల్లో 29 మంది పౌరులను హతమార్చారని కశ్మీర్ ఏడీజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఆరుగురు హిందువులు, ముగ్గురు కాశ్మీరీ పండిట్లు , 15 మంది ముస్లింలతో సహా 21 మంది స్థానికులు ఉన్నారు. ఇది కాకుండా ఎనిమిది మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది టెర్రర్ మాడ్యూళ్లను ఛేదించిన సందర్భంగా 360 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 121 ఎకె సిరీస్ రైఫిల్స్, ఎనిమిది ఎం4 కార్బైన్లు , 231 పిస్టళ్లతోపాటు మొత్తం 360 ఆయుధాలు జప్తు చేశామన్నారు.
186 మంది ఉగ్రవాదుల్లో 56 మంది పాకిస్థానీలు మృతి, 159 మంది అరెస్ట్: డీజీపీ
2022లో 56 మంది పాకిస్థానీలు సహా 186 మంది ఉగ్రవాదులు హతమయ్యారని జమ్మూ కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దిల్బాగ్ సింగ్ తెలిపారు. వివిధ ఎన్ కౌంటర్లలో 159 మందిని అరెస్టు చేశారు. కేంద్ర పాలిత ప్రాంతంలో 'జీరో టెర్రర్' కార్యకలాపాలను సాధించేందుకు పోలీసులు, ఇతర భద్రతా సంస్థలు సరైన దిశలో పయనిస్తున్నాయని ఆయన అన్నారు. 146 పాకిస్థాన్ టెర్రర్ మాడ్యూళ్లను ఛేదించినట్లు పోలీసు చీఫ్ తెలిపారు.
వీరిలో నలుగురైదుగురు సభ్యులు ఉన్నారు, వీరికి లక్షిత హత్యలు , గ్రెనేడ్-IED దాడులను నిర్వహించే పనిని అప్పగించారు. జమ్మూకశ్మీర్లో ఈ ఏడాది 100 మంది యువకులు మిలిటెన్సీలో చేరారని ఆయన అన్నారు. ఇది చాలా సంవత్సరాలలో అతి తక్కువ. వారిలో చాలా మంది ఎలిమినేట్ అయ్యారు. యాక్టివ్గా ఉన్న ఉగ్రవాదుల సంఖ్యను రెండంకెలకు తగ్గించేందుకు భద్రతా బలగాలు కృషి చేస్తున్నాయి.