Massive Fire At 3-Storey Building In Delhi: పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని వాణిజ్య భవనంలో భారీ అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో  27 మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల మంది తీవ్రంగా గాయపడ్డారు. 

Massive Fire At 3-Storey Building In Delhi:  దేశ రాజ‌ధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో పెద్ద సంఖ్య‌లో ప్రాణ‌న‌ష్టం సంభ‌వించింది. ప్ర‌స్తుతం అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. ఈ అగ్ని ప్ర‌మాదంలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని వాణిజ్య భవనంలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది.  స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది భవనం నుంచి 60-70 మందిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం 4.45 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని ముండ్కాలోని వాణిజ్య కార్యాలయ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 26 మంది మరణించారు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి 10 గంటల వరకు ప్రజలు భవనంలోనే చిక్కుకున్నారు. ఇప్పటి మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. 24 అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకుని... మంటలను ఆర్పుతున్నాయి. 

మంటలు చెలరేగడంతో స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కార్యాలయ అద్దాలను పగులగొట్టి లోపల చిక్కుకున్న వారిని రక్షించారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించారు. బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించేందుకు అంబులెన్స్ కూడా అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్నాయి. కిటికీల నుంచి బయటపడేందుకు చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. భవనంలోని సీసీటీవీ కెమెరాలు తయారు చేసే అంతస్థులో మంటలు ప్రారంభమయ్యాయి.

ఈ ఘటనపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్పందిస్తూ.. "ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని భవనంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం ఎంతగానో బాధించింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అని ట్వీట్ చేశారు.

Scroll to load tweet…


ప్రమాదంపై మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Scroll to load tweet…

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. "ఈ విషాద సంఘటన గురించి తెలిసి దిగ్భ్రాంతికి గుర‌య్యాను.. ఎంతో బాధ కలిగింది. నేను నిరంతరం అధికారులతో టచ్‌లో ఉన్నాను.  అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి మరియు ప్రాణాలను రక్షించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు అందరినీ ఆశీర్వదిస్తాడు" అంటూ ట్వీట్ చేశారు. 
 

Scroll to load tweet…