ఉత్తర ప్రదేశ్ లో ఓ 14యేళ్ల బాలుడిని కుక్క కరిచింది. ఈ విషయం ఇంట్లో చెప్పకపోవడంతో రేబిస్ సోకి మృతి చెందాడు.
ఉత్తర ప్రదేశ్ : ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. రేబీస్ బారిన పడిన ఓ 14 ఏళ్ల బాలుడు విచిత్రంగా ప్రవర్తిస్తూ మృత్యువాతపడ్డాడు. గాలికి వణికిపోయాడు. నీటిని చూస్తే భయపడ్డాడు. చీకటిలో ఉండడానికే ఇష్టపడ్డాడు. ఇవన్నీ రేబిస్ లక్షణాలే. ఈ విచిత్ర ప్రవర్తన, అనారోగ్య పరిస్థితులు కుటుంబ సభ్యులకు అర్థం కాలేదు.. వెంటనే బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అయితే వైద్యులు మాత్రం బాలుడిని ఆస్పత్రిలో చేర్చుకునేందుకు ఒప్పుకోలేదు. ఉత్తరప్రదేశ్ లోని విజయనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చరణ్ సింగ్ కాలనీలో ఈ ఘటన వెలుగు చూసింది. యాకూబ్ అనే వ్యక్తి ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అతని పెద్ద కుమారుడు సాబేజ్. ఆ బాలుడిని నెల రోజుల క్రితం ఓ కుక్క కరిచింది.
అయితే, ఇంట్లో చెబితే కోప్పడతారన్న భయంతో అతను ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. దీంతో బాలుడికి రేబీస్ సోకింది. నాలుగు రోజుల క్రితం ఆ లక్షణాలు బయటపడ్డాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా బాలుడు విచిత్రంగా ప్రవర్తిస్తుండడంతో ఇంట్లో వాళ్లకు మొదట ఏమీ అర్థం కాలేదు. క్రమక్రమంగా సాబేజ్ ఆరోగ్యపరిస్థితి క్షీణించడం మొదలయ్యింది.
ఆటోడ్రైవర్ మోసం..సెకన్లలో రూ.500 కొట్టేశాడు.. వీడియో ఎడిటింగ్ లో వెలుగులోకి...
పిల్లాడి ప్రవర్తనలో విచిత్రంగా ఉంటుండడంతో కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలుడికి వైద్యం చేసిన వైద్యులు ఆసుపత్రిలో చేర్చుకోవడానికి మాత్రం నిరాకరించారు. సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో సాబేజ్ హృదయ విధారక స్థితిలో మృతి చెందాడు. దీనిమీద కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
మొదట తమ కొడుకుని చికిత్స కోసం ఘజియాబాద్ లోని ఎం శ్రీ ఆసుపత్రితో పాటు మీరట్, ఢిల్లీలోని జీటీబీ, ఎయిమ్స్ ఆస్పత్రులకు తీసుకెళ్లామని తెలిపారు. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాబేజ్ ను పొరుగు ఇంట్లో ఉన్న ఒక కుక్క కరిచిందని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఆ ఇంట్లో ఉండే ఓ మహిళ కుక్కను పెంచుకుంటుంది. వీధి కుక్కలకు కూడా ఆహారం అందిస్తుంది. దీంతో ఆమె ఇంటి దగ్గర ఓ ఐదారు కుక్కలు క్రమం తప్పకుండా ఉంటుంటాయి. ఆ మహిళ పెంచుకుంటున్న కుక్క తమ కొడుకుని కరిచిందని… దీంతోనే బాలుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడికి జరిగిన విధంగా ఎవరికి జరగకుండా చూసుకోవాలని…కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయం వెలుగు చూడడంతో కుక్క యజమానికి నగరపాలక అధికారులు నోటీసులు అందించారు.