ఈడీ, సీబీఐ దర్యాప్తులపై విపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ విషయమై మార్గదర్శకాలు ఇవ్వాలని కూడా కోరాయి.
న్యూఢిల్లీ: ఈడీ, సీబీఐ ఏకపక్ష దర్యాప్తులపై సుప్రీంకోర్టులో 14 విపక్ష పార్టీలు శుక్రవారంనాడు పిటిషన్ దాఖలు చేశాయి. అరెస్ట్కు ముందు అరెస్ట్ తర్వాత మార్గదర్శకాలను ఆ పిటిషన్ లో కోరాయి 14 పార్టీలు.
బీజేపీయేతర పార్టీలకు చెందిన నేతలపై ఏకపక్షంగా సీబీఐ, ఈడీలను కేంద్రం ఉపయోగిస్తుందని 14 పార్టీలు ఆ పిటిషన్ లో పేర్కొన్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని 14 పార్టీలు ఈ పిటిషన్ ను దాఖలు చేశాయి.
డీఎంకె, ఆర్జెడీ , భారత రాష్ట్ర సమితి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు ఈ పిటిషన్ పై సంతకం చేశాయి. విపక్ష పార్టీల తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకోర్టులో వాదలను విన్పించారు. సీజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఏడాది ఏప్రిల్ 5న విచారణ చేయనుందని సుప్రీంకోర్టు తెలిపింది.ఈడీ, సీబీఐ కేసులు 95 శాతం విపక్ష పార్టీల నేతలపైనే ఉన్నాయని సుప్రీంకోర్టుకు అభిషేక్ మను సింఘ్వి చెప్పారు. అరెస్ట్ కు ముందు , అరెస్ట్ తర్వాత మార్గదర్శకాలను సుప్రీంకోర్టు ను సింఘ్వి అడిగారు.
నరేంద్ర మోడీపై రాహుల్ గాంధీ 2019లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో నిన్న సూరత్ కోర్టు కీలక తీర్పును ఇచ్చింది.ఈ కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్షను విధించింది కోర్టు. ఆ తర్వాత బెయిల్ కూడా ఇచ్చింది కోర్టు. ఈ ఘటనను బీజేపీయేతర పార్టీల నేతలు, సీఎంలు ఖండించారు. ఈ విషయమై ఇవాళ బీజేపీయేతర పార్టీలతో కాంగెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమయంలోనే సుప్రీంకోర్టులో 14 పార్టీలు పిటిషన్ దాఖలు చేశాయి.
ఈడీ, సీబీఐ దర్యాప్తు సంస్థలను ఉపయోగించి విపక్ష నేతలను ఇబ్బంది పెడుతున్నారని బీజేపీయేతర పార్టీలు విమర్శించాయి.ఈ విషయమై ప్రధాని మోడీకి ఈ పార్టీలు ఇటీవలనే లేఖను రాసిన విషయం తెలిసిందే. మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన తర్వాత ఈ లేఖను విపక్ష పార్టీలు ప్రధానికి లేఖ రాశాయి.
2024 పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో దర్యాప్తు సంస్థల దుర్వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని విపక్షపార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి
