యూపీలో 11 ఏళ్ల బాలిక దారుణ హత్య: ముగ్గురి అరెస్ట్
దళిత కులానికి చెందిన 11 ఏళ్ల బాలిక హత్యకు గురైంది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బధోని గ్రామంలో ఈ ఘటన గురువారం నాడు చోటు చేసుకొంది.
లక్నో: దళిత సామాజిక వర్గానికి చెందిన 11 ఏళ్ల బాలిక హత్యకు గురైంది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బధోహీ గ్రామంలో ఈ ఘటన గురువారం నాడు చోటు చేసుకొంది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని హాత్రాస్ లో 19 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి చిత్రహింసలకు గురిచేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత నెల 29వ తేదీన ఆమె మరణించింది. ఆమె అంత్యక్రియలను అర్ధరాత్రి నిర్వహించారు. అయితే హత్రాస్ బాధితురాలిపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేసినట్టుగా యూపీ ఏడీజీ ప్రశాంత్ కుమార్ గురువారం నాడు ప్రకటించిన విషయం తెలిసిందే.
బధోహీ గ్రామంలో హత్య చేయబడిన బాలిక కుటుంబానికి నిందితుల కుటుంబానికి మధ్య శతృత్వం ఉన్నట్టుగా పోలీసులు చెప్పారు.పశువులను మేపడానికి పొలాలకు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు. ఆమె కోసం వెళ్లిన సోదరుడికి బాలిక శవం కన్పించింది.
గురువారం నాడు సాయంత్రం నిందితులపై హత్య కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు. మృతురాలిపై అత్యాచారం చేసినట్టుగా అనుమానిస్తున్నామని.. ఈ విషయం ఇంకా నిర్ధారణ కావాల్సి ఉందని పోలీసులు ప్రకటించారు.
హత్రాస్ లో యువతి మరణించిన రెండు రోజులకే ఈ ఘటన చోటు చేసుకొంది. హత్రాస్ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమౌతున్నాయి.
హత్రాస్ ఘటనలో మరణించిన యువతి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ కలిసేందుకు వెళ్లే సమయంలో పోలీసులు గురువారం నాడు అడ్డుకోవడం రాజకీయ మలుపు తీసుకొంది.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాన్వాయ్ ను పోలీసులు రోడ్డుపై నిలిపివేసిన సమయంలో రోడ్డుపై వీరిద్దరూ నడుచుకొంటూ వెళ్తుండగా పోలీసులు నేలమీద నెట్టివేసి లాఠీచార్జీ చేశారని రాహుల్ గాంధీ ఆరోపించాడు. వీరిద్దరిని అరెస్ట్ చేసి ఆ తర్వాత ఢిల్లీకి తరలించారు పోలీసులు.
బధోహీ ఘటనపై కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా స్పందించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. జస్టిస్ ఫర్ ఇండియాస్ డాటర్స్ అనే హ్యాష్ ట్యాగ్ తో భదోని ఘటనను కాంగ్రెస్ ట్వీట్ చేసింది.