విషం పెట్టి.. 11 నెమళ్లను చంపిన రైతు, అరెస్ట్
ఈ ప్రాంతంలో రైతులు తమ వ్యవసాయ పొలంలో కాయకూరలు, పండ్లు సాగు చేస్తున్నారు. వీటిని ఆ ప్రాంతంలోని నెమళ్లు తరచూ ధ్వంసం చేస్తున్నాయి. దీనిపై పలువురు రైతులు అటవీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
కేరళలో టపాసులు నిండిన పైనాపిల్ తిని ఓ గర్భంతో ఉన్న ఏనుగు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశంలోని ప్రజలందరినీ తీవ్రంగా బాధించింది. ఈ ఘటనకు కారకులైన వారిని శిక్షించాలంటూ చాలా మంది డిమాండ్ చేశారు. కాగా... ఈ దుర్ఘటన మరవకముందే అలాంటిదే మరో సంఘటన చోటుచేసుకుంది.
కాగా.. అక్కడ ఏనుగును పొట్టనపెట్టుకోగా.. ఇక్కడ నెమళ్లను చంపేశారు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తిరపూర్జిల్లా తారాపురం సమీపం చిన్న పుత్తూర్ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో రైతులు తమ వ్యవసాయ పొలంలో కాయకూరలు, పండ్లు సాగు చేస్తున్నారు. వీటిని ఆ ప్రాంతంలోని నెమళ్లు తరచూ ధ్వంసం చేస్తున్నాయి. దీనిపై పలువురు రైతులు అటవీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో సోమవారం ఉదయం ఓ పొలంలో 11 నెమళ్లు మృతి చెంది పడి ఉండడాన్ని స్థానిక రైతులు గుర్తించి వ్యవసాయ శాఖ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఈమేరకు వ్యవసాయ అధికారి తిరుమూర్తి, అటవీశాఖ ఉద్యోగి మణివన్నన్ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన రైతు ముత్తుస్వామి కుమారుడు శ్యామ్లయ్యాన్ విషం పెట్టి ఆ నెమళ్లను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తన పంటను నెమళ్లు నాశనం చేయడంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.