11 సింహాలు మృతి...విచారణకు ప్రభుత్వం ఆదేశం
రాజులా అటవీ ప్రాంతంలో కొన్ని సింహాల కళేబరాలు లభ్యం కాగా.. అదే రోజు దల్ఖనియా రేంజ్ ప్రాంతంలో మరో మూడు సింహాల కళేబరాలు దొరికాయి.
ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 11 సింహాలు మృత్యువాతపడ్డాయి. ఇవన్నీ ఒకేసారి చనిపోవడం గమనార్హం. దీంతో విషయం తెలుసుకున్న గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించింది.
గిర్ అడవుల్లో 11 సింహాలు మృతి చెంది ఉండటాన్ని మేం గుర్తించాం. మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు వాటి నమూనాలను పోస్టుమార్టం నివేదిక కోసం పంపించాం’ అని అటవీశాఖ అధికారి పి.పురుషోత్తమ్ తెలిపారు. బుధవారం అమ్రేలి జిల్లాలోని రాజులా అటవీ ప్రాంతంలో కొన్ని సింహాల కళేబరాలు లభ్యం కాగా.. అదే రోజు దల్ఖనియా రేంజ్ ప్రాంతంలో మరో మూడు సింహాల కళేబరాలు దొరికాయి.
ప్రాథమిక నివేదిక ప్రకారం మృతి చెందిన 11 సింహాలలో ఎనిమిది ఘర్షణ పడటం కారణంగా అంతర్గత భాగాల్లో తీవ్ర గాయాలు కావడం వల్ల మృతి చెందినట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ డా.రాజీవ్కుమార్ గుప్తా తెలిపారు. సింహాల కళేబరాలు లభ్యమైన ప్రాంతాన్ని పీసీసీఎఫ్ వైల్డ్లైఫ్ ఏకే సక్సేనా పరిశీలించారు. 2015 గణాంకాల ప్రకారం గిర్ అడవుల్లో 520 సింహాలు ఉన్నాయి.