Thunderstorms : అసోంలో వర్షబీభత్సం.. పిడుగుపాటు కారణంగా 11 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం నుంచి కురుస్తున్న ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కారణంగా ఒక్క దిబ్రూఘర్లోని ఖేర్ని గ్రామంలోనే నలుగురు వ్యక్తులు మరణించారు.
Thunderstorms In Assam: దేశంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న ఆకాల వర్షాలు పంటలను దెబ్బతీయడంతో పాటు పలువురి ప్రాణాలను తీసుకుంటున్నాయి. అసోంలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. గురువారం సాయంత్రం నుంచి అసోంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కురుస్తున్న వర్షాల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలు కారణంగా 11 మంది చనిపోయారని అధికారులు తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. అసోంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షంతో పాటు పిడుగులు, తుఫాను కారణంగా కనీసం 11 మంది మరణించారని అధికారులు తెలిపారు. గురువారం నుంచి అసోంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. భారీ తుఫాను కారణంగా శుక్రవారం సాయంత్రం దిబ్రూఘర్లోని ఖేర్ని గ్రామంలో నలుగురు వ్యక్తులు మరణించారు. అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ASDMA), దిబ్రూగఢ్ జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్, దీప్జ్యోతి హటికాకోటి మాట్లాడుతూ.. "దిబ్రూఘర్ జిల్లాలోని టింగ్కాంగ్ రెవెన్యూ గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఉరుములతో కూడిన వర్షం కారణంగా కనీసం నలుగురు వ్యక్తులు మరణించారు.. బలమైన తుఫానుతో ఆ ప్రాంతంలో అనేక చెట్లు నేలకొరిగాయి" అని వెల్లడించారు.
గురువారం బార్పేట జిల్లాలో తుఫాను కారణంగా మరో ముగ్గురు వ్యక్తులు మరణించగా, గోల్పరా జిల్లాలో పిడుగుపాటుకు 15 ఏళ్ల బాలుడు మరణించాడు. శుక్రవారం సాయంత్రం వచ్చిన భారీ తుఫాను తర్వాత టిన్సుకియాలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. టిన్సుకియా అదనపు డిప్యూటీ కమిషనర్ దీపు కుమార్ దేకా మాట్లాడుతూ.. "నిన్న సాయంత్రం టిన్సుకియా జిల్లాలోని మార్గెరిటా రెవెన్యూ సర్కిల్ వద్ద ముగ్గురు వ్యక్తులు మరణించారు" అని తెలిపారు. "తుఫాను సమయంలో చాలా ఇళ్ళు మరియు ఆస్తులు దెబ్బతిన్నాయి. వందల మంది నిరాశ్రయులు అయ్యారు. వారు ప్రస్తుతం రాష్ట్రలోని పాఠశాలలు మరియు ప్రభుత్వ కార్యాలయాలలో ఆశ్రయం పొందుతున్నారు" అని తెలిపారు. తుఫాను కారణంగా గత కొన్ని రోజులుగా అనేక చోట్ల చెట్లు మరియు డజన్ల కొద్దీ విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. అనేక ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. గత రెండు రోజుల్లో రాష్ట్రంలో కనీసం 7,378 ఇళ్లు, ఇతర సంస్థలు దెబ్బతిన్నాయని తెలిపింది. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. రోడ్లు దెబ్బతినడంతో అనేక చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి.
