మరోసారి కరోనా వైరస్ దాని రూపం మార్చుకుని పంజా విసరడానికి సిద్ధం అవుతున్నది. మూడో వేవ్లో ఎక్కువగా కనిపించిన బీఏ.2 కంటే కూడా పది రెట్లు ప్రమాదకరమైన బీఏ.12 వేరియంట్ బిహార్లో వెలుగుచూసినట్లుగా అధికారులు తెలిపారు.
పాట్నా: కరోనా వైరస్ మరోసారి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. ఇప్పటికే మన దేశంలో మూడు వేవ్లతో ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసిన ఈ వేరియంట్ తాజాగా, మరింత ప్రమాదకరంగా ముందుకు వస్తున్నట్టు తెలుస్తున్నది. థర్డ్ వేవ్లో మనం చూసిన వేరియంట్ కంటే కూడా పది రెట్లు ప్రమాదకరమైన కొత్త వేరియంట్ బిహార్లో గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఈ వేరియంట్ను బీఏ.12గా పేర్కొంటున్నారు. ఈ వేరియంట్ పాట్నాలోని ఇందిరా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గుర్తించినట్టు వివరించారు. ఈ వేరియంట్ తొలిసారిగా అమెరికాలో వెలుగుచూసింది.
మన దేశంలో వచ్చిన కరోనావైరస్ థర్డ్ వేవ్లో అధికంగా కేసులు బీఏ.2కు సంబంధించినవే ఉన్నాయి. కానీ, ఇప్పుడు పాట్నాలో కనిపించిన వేరియట్ బీఏ.12.. ఈ బీఏ.2 కంటే పది రెట్లు ప్రమాదకరమైనదిగా ఇందిరా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రొఫెసర్, మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ హెచ్వోడీ డాక్టర్ నమ్రతా కుమారి తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయడానికి శాంపిళ్లను పంపిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు 13 శాంపిళ్లను పరీక్షించామని వివరించారు. అందులో కేవలం ఒకటే బీఏ.12 వేరియంట్గా గుర్తించినట్టు తెలిపారు. మిగిలిన 12 శాంపిళ్లు బీఏ.2గా గుర్తించినట్టు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే తాము ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ తేలినవారి కాంట్రాక్టులను వెంటనే ట్రేస్ చేయాలని అధికారులను కోరినట్టు ప్రొఫెసర్ డాక్టర్ నమ్రతా కుమారి వివరించారు. బీఏ.12 వేరియంట్ బీఏ.2 వేరియంట్ కంటే పది రెట్లు ప్రమాదకరమైనదని తెలిపారు. అయినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ కొత్త వేరియంట్ బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. ఈ వేరియంట్ రెండు మూడు కేసులు ఢిల్లీలోనూ వెలుగులోకి వచ్చాయి. తాజాగా, బిహార్లో రిపోర్ట్ అయింది.
దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ, దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లో కోవిడ్ పెరుగుతోంది. ఆ ప్రాంతంలో రోజు రోజుకు కేసులు ఎక్కువవుతోంది. దీంతో ప్రజలు ఆందోళనకు గురువుతున్నారు. అయితే కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. హాస్పిటలో చేరికలు, మరణాల సంఖ్య తక్కువగానే ఉండటం కాస్త ఊరటనిచ్చే అంశం.
గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 1,367 తాజా COVID-19 కేసులు నమోదు అయ్యాయి. దీంతో పాటు కరోనాతో ఒకరు మృతి చెందారు. ఢిల్లీలో సానుకూలత రేటు 4.50 శాతంగా ఉంది. ఈ మేరకు ఆరోగ్య శాఖ బుధవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం రాజధానిలో ఒక రోజులో వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవడం వరుసగా ఇది ఆరో రోజు. కాగా, దేశంలో మొత్తం 3,303 కొత్త కేసులు నమోదయ్యాయి. 39 మంది కరోనాతో మరణించారు. కాగా, గడిచిన 24 గంటల్లో 2,563 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో గడిచిన రోజులో యాక్టివ్ కేసులు నికరంగా 701 కేసులు పెరిగాయి. దీంతో ప్రస్తుతం దేశం మొత్తంలో 16,980 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
