వెలుగులోకి వచ్చిన మరో వీడియో.. మంత్రికి సపర్యాలు చేయడానికి పదిమంది సేవకులు.. బీజేపీ సంచలన ఆరోపణలు..
తీహార్ జైలులో ఉన్న సత్యేందర్ జైన్కు సంబంధించిన మరో వీడియోను బీజేపీ ఆదివారం విడుదల చేసింది. ఈ వీడియోలో జైలు సిబ్బంది ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ సెల్ను శుభ్రం చేస్తున్నారు. దీంతో బీజేపీ విమర్శలు గుప్పిస్తుంది.
మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD)ఎన్నికల నేపథ్యంలో ఆప్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే పనిలో బీజేపీ నిమగ్నమైంది. ఈ క్రమంలో ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ కు సంబంధించిన మరొక CCTV వీడియోను బీజేపీ ఆదివారం విడుదల చేసింది. ఈ వీడియోలో జైలు సిబ్బంది ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ సెల్ను శుభ్రం చేస్తున్నారు. అదే సమయంలో సత్యేందర్ జైన్ తన సెల్లో కొంతమందితో మాట్లాడుతుండటం ఆ వీడియో చూడవచ్చు. ఈ 2 నిమిషాల వీడియో అక్టోబర్ 1, 2022 నాటిదని బీజేపీ పేర్కొంది.
ఆప్ మంత్రికి 10 మంది సపర్యాలు .. బీజేపీ ఆరోపణ
సత్యేందర్ జైన్ బ్యారక్ను జైలు సిబ్బంది శుభ్రం చేస్తున్న వీడియోపై బీజేపీ ఢిల్లీ ప్రభుత్వంపై విరుచుకుపడింది. జైల్లో జైన్కు సేవ చేసేందుకు 10 మందిని నియమించారని ఢిల్లీ ప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి హరీశ్ ఖురానా ఆరోపించారు. ఈ వీడియోను బీజేపీ నేత తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అతను ఇలా రాసుకోచ్చారు.10 మంది ఉద్యోగులు జైలులో ఉన్న మంత్రి జైన్ కు సేవ చేస్తున్నారు . అని పేర్కొన్నారు.
మనీలాండరింగ్ కేసులో జైలుకెళ్లిన ఢిల్లీ ప్రభుత్వ మంత్రి సత్యేందర్ జైన్ సీసీటీవీ వీడియోలు ఆమ్ ఆద్మీ పార్టీని కలవరపెడుతున్నాయి. మంత్రి జైన్ కు మసాజ్ చేసిన తర్వాత ఆహారం తింటున్న వీడియో వైరల్ కావడంతో ఆమ్ ఆద్మీ పార్టీపై బీజేపీ, కాంగ్రెస్లు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదిలా ఉండగా..సెప్టెంబరు 12వ తేదీ శనివారం నాడు మరో వీడియో ప్రచారంలోకి వచ్చింది.ఇందులో జైన్ సెల్లో అప్పటి జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్తో మాట్లాడుతూ కనిపించాడు.
మసాజ్ ఖైదీపై అత్యాచారం ఆరోపణలు
తొలిసారిగా నవంబర్ 19న సత్యేందర్ జైన్ సెల్లో మసాజ్ చేస్తున్న వీడియో ప్రసారమైంది. సత్యేందర్ జైన్కు మసాజ్ చేసిన ఖైదీ మైనర్ పై అత్యాచారానికి పాల్పడ్డాడని బీజేపీ ఆరోపించింది. రింకూ అనే రేప్ నిందితుడు జైన్ కు క్రమం తప్పకుండా బాడీ మసాజ్ చేస్తాడని ఆరోపించింది. ఈ తాజా వీడియో బీజేపీ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించడంతో వారు జైలు ఖైదీలా లేదా మంత్రికి ఉచిత ప్రవేశం కల్పించిన బయటి వ్యక్తులా అనే విషయంపై విచారణ జరగనుంది.
ఐదు నెలలుగా బెయిల్ పిటిషన్ తిరస్కరణ
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సత్యేందర్ జైన్ను 31 మే 2022న మనీలాండరింగ్ ఆరోపణలపై అరెస్టు చేసింది. అప్పటి నుంచి జైన్ తీహార్లో ఉంటున్నారు. అతను బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు, అయితే 5 నెలలుగా ఒక్కసారి కూడా అతనికి బెయిల్ మంజూరు కాలేదు.
జైన్ ప్రత్యేక ఆహారం కోసం అభ్యర్థన .. కోర్టు తిరస్కరణ
అంతకుముందు.. జైలులో ప్రత్యేక ఆహారం అందించాలని సత్యేందర్ జైన్ అభ్యర్థించారు. కానీ, మంత్రి దరఖాస్తును ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు శనివారం తిరస్కరించింది. జైలులో డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్ కావాలని జైన్ డిమాండ్ చేశాడు. ఢిల్లీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సత్యేందర్ జైన్కు పండ్లు, కూరగాయలు అందించడంలో జైలు అధికారులు ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నారని తీహార్ జైలు రికార్డులు ప్రాథమికంగా చూపుతున్నాయని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అధికారులు జైలు నిబంధనలను (డీపీఆర్ 2018) కూడా ఉల్లంఘించారని తెలిపింది.
ఈ క్రమంలో నవంబర్ 14న జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్ను ఢిల్లీ ప్రభుత్వ హోం శాఖ సస్పెండ్ చేసింది. జైలు నంబర్ ఏడో ఖైదీలకు అక్రమ సౌకర్యాలు కల్పించారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో జైలు సూపరింటెండెంట్ పాత్రపై విచారణ జరుగుతోంది. ఇప్పటివరకు 8 వీడియోలు వెలుగులోకి వచ్చాయి. రానున్న రోజుల్లో ఎన్ని వీడియోలు బయటపడుతాయో వేచి చూడాలి.