ఉత్తరాఖండ్లో మంచుతుఫాన్.. 10 మంది దుర్మరణం, మరో 18 మంది గల్లంతు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
ఉత్తరాఖండ్లో ద్రౌపది దండా-2 పర్వతంపై మంచుతుఫాన్ సంభవించింది. ఆ సమయంలో అక్కడే ఉన్న 28 మంది ఆ హిమపాతంలో చిక్కుకుపోయారు. రెస్క్యూ ఆపరేషన్లో పది మంది మృతదేహాలు లభించాయి. కాగా, మిగిలిన 18 మంది కోసం గాలింపులు కొనసాగుతున్నాయి.
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లో మంచుతుఫాన్ పది మందిని పొట్టనబెట్టుకుంది. మరో 18 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నది. ఈ ఘటన రాష్ట్రంలోని ద్రౌపదీకి చెందిన దండా2 పర్వతంపై సుమారు 16వేల అడుగుల ఎత్తులో చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం 9 గంటల ప్రాంతలో ఈ మంచుతుఫాన్ సంభవించింది.
ఉత్తరకాశీలోని నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ నుంచి 40 మంది ట్రెక్కింగ్ చేయడానికి బయల్దేరారు. వారంతా ద్రౌపదీ దండా-2 పర్వతంపైకి వెళ్లుతున్నారు. అందులో 33 మంది ట్రైనీలు ఉండగా ఏడుగురు ఇన్స్ట్రక్టర్లు ఉన్నారు.
ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో మంచు తుఫాన్ వచ్చినప్పుడు 28 మంది అందులో చిక్కుకున్నారు. ఈ 28 మంది పది మంది మృతదేహాలు లభించినట్టు నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ ప్రిన్సిపల్ కల్నల్ బిష్త్ ధ్రువీకరించారు. కాగా, మిగిలిన 18 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. వారి కోసం గాలింపులు జరుగుతున్నాయి.
Also Read: సియాచెన్లో మంచుతుఫాన్లో కనిపించకుండా పోయిన జవాన్.. 38 ఏళ్ల తర్వాత మృతదేహం లభ్యం
రెస్క్యూ పనుల్లో ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు కూడా సహకరిస్తున్నాయని ఉత్తరాఖండ్ పోలీసు చీఫ్ అశోక్ కుమార్ తెలిపారు.
గాయపడిన ట్రైనీలను తొలుత 13 వేల అడుగుల ఎత్తులోని సమీప హెలిప్యాడ్కు పంపిస్తున్నట్టు ఓ రెస్క్యూ అధికారి వివరించారు. ఆ తర్వాత రాష్ట్ర రాజధాని డెహ్రడూన్కు తరలిస్తున్నట్టు తెలిపారు.
జిల్లాకు చెందిన సిబ్బంది ర్యాపిడ్ రిలీఫ్, రెస్క్య ఆపరేషన్స్లో మునిగిపోయారు. అలాగే, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఐటీబీపీ సిబ్బంది కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాలుపంచుకుంటున్నారు. ఈ ఘటన పై సీఎం పుష్కర్ సింగ్ దామి స్పందించారు.
‘ద్రౌపది దండా-2 పర్వతంపై నెహ్రూ మౌంటనీరింగ్ ఇన్స్టిట్యూట్కు చెందిన 28 మంది ట్రైనీలు హిమపాతంలో చిక్కుకున్నారు. సహాయక చర్యల కోసం కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు విజ్ఞప్తి చేశాను. ఆర్మీ సహాయం కోరాను. కేంద్రం నుంచి అవసరమైన అన్ని రకాల సహకారాలు అందిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా బయటపడటానికి రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నాం’ అని వివరించారు.
ఈ 40 మంది బృందం సెప్టెంబర్ 23న ఉత్తరకాశి వదిలి ట్రెక్కింగ్ మొదలు పెట్టింది.