అసోంలో పడవ మునక.. అధికారులు సహా పది మంది గల్లంతు
అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో పడవ మునిగిపోయింది. ఆ సమయంలో 29 మంది పడవలో ప్రయాణిస్తున్నారు. పది మంది గల్లంతయ్యారు. అందులో ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారు. ముగ్గురు ప్రభుత్వ అధికారులు నీట మునిగిపోయారు. కాగా, ఇద్దరు ఈదుతూ బయటపడ్డారు. కానీ, ఒక అధికారి ఆచూకీ ఇంకా లభించలేదు.
న్యూఢిల్లీ: అసోంలో బ్రహ్మపుత్ర నదిలో ఓ పడవ మునిగింది. స్థానికంగా తయారు చేసిన ఆ పడవలో ప్రమాద సమయంలో 29 మంది ప్రయాణిస్తున్నారు. ధుబ్రి పట్టణం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఓ బ్రిడ్జీ పోస్టును ఢీకొట్టి మునిగిపోయింది.
భాషాణికి వెళ్లడానికి ముగ్గురు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అందులో బయల్దేరారు. అందులో దుబ్రి సర్కిల్ అధికారి సంజు దాస్ కూడా ఉన్నాడు. ఆయన ఆచూకీ ఇంకా తెలియరాలేదు. కాగా, మరో ఇద్దరు ప్రభుత్వ అధికారులు మాత్రం ఈదుతూ సురక్షితంగా తీరాన్ని చేరారు.
మొన్నటి దాకా అసోం రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. ఈ వరదల వల్ల కోతకు గురైన ప్రాంతాలను ఆ అధికారులు పర్యటిస్తున్నారు. ఆ చిన్న పడవలో అధికారులు సహా కొందరు స్థానికులు కూడా ప్రయాణిస్తున్నారు.
ఆ పడవ అదాబారి దగ్గరి ఓ బ్రిడ్జీ పోస్టును ఢీకొట్టింది. అంతే.. ఆ పడవ మునక వేసింది. ఇప్పటికి 10 మంది గల్లంతయ్యారు. ఇందులో ఓ ప్రభుత్వ అధికారి ఆచూకీ ఇంకా లభించలేదు.