హిందూ మతం బూటకమన్న స్వామి ప్రసాద్ మౌర్య నాలుక కోస్తే 10 లక్షలిస్తా - యూపీ కాంగ్రెస్ నేత పండిట్ గంగారాం శర్మ
హిందూ మతం ఒక బూటకం అని వ్యాఖ్యలు చేస్తూ వీడియో విడుదల చేసిన సమాజ్ వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్యపై యూపీకి చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ మతాన్ని కించపరిచేలా మాట్లాడిన అతడి నాలుక కోస్తే రూ.10 లక్షల రివార్డు ఇస్తానని ప్రకటించారు.
సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ స్వామి ప్రసాద్ మౌర్య నాలుక కోస్తే రూ.10 లక్షలు ఇస్తామని యూపీకి చెందిన కాంగ్రెస్ నేత పండిత్ గంగారాం శర్మ అన్నారు. గత సోమవారం మౌర్య హిందూ మతంపై వివాదాస్ప వ్యాఖ్యలు చేశారు. అవి రాజకీయ దుమారాన్ని రేపాయి. బ్రాహ్మణిజం మూలాలు లోతుగా ఉన్నాయని, అన్ని రకాల అసమానతలకు కూడా ఇదే కారణమని స్వామి ప్రసాద్ ట్విట్టర్ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. దీంతో మొరాదాబాద్ లోని కాంగ్రెస్ మానవ హక్కుల విభాగం చైర్మన్ గా ఉన్న పండిట్ గంగారాం శర్మ ఓ లేఖ విడుదల చేశారు. అందులో మౌర్య నాలుక కోసిన వారికి రివార్డు ఇస్తామని ప్రకటించారు.
ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హిందూ మతాన్ని కించపరుస్తూ రామచరిత మానస్ అనే మత గ్రంథాన్ని ఎస్పీ నేత స్వామి ప్రసాద్ మౌర్య కించపరిచారని పండింత్ గంగారాం ఆరోపించారు. అవసరమైతే తన మతం కోసం ప్రాణత్యాగం కూడా చేస్తానని పేర్కొన్నారు. మౌర్య నాలుక కోసిన వారికి రూ.10 లక్షల రివార్డు కూడా ఇస్తామని ప్రకటించారు. సమాజ్ వాదీ నేత రామచరిత మానస్ పదేపదే ప్రకటనలు చేస్తూ వివాదాన్ని రెచ్చగొడుతున్నారని ఆ లేఖలో ఆరోపించారు. ఈ లేఖపై ఆ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అస్లాం మాట్లాడుతూ.. పండింత్ గంగారాం శర్మ ప్రకటన ఆయన వ్యక్తిగతం అని అన్నారు. ఈ ప్రకటనతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఇంతకీ మౌర్య ఏమన్నారంటే ?
బ్రాహ్మణిజం మూలాలు చాలా లోతైనవని, ఈ అసమానతలన్నింటికీ కారణం కూడా బ్రాహ్మణవాదమేనని అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్విట్టర్ లో ఓ వీడియో విడుదల చేశారు. ‘‘హిందూ అనే మతం లేదు. హిందూ మతం కేవలం బూటకం మాత్రమే. అదే బ్రాహ్మణ మతాన్ని హిందూ మతంగా ముద్రవేసి ఈ దేశంలోని దళితులు, గిరిజనులు, వెనుకబడిన ప్రజలను ఇరకాటంలో పెట్టేందుకు కుట్ర జరుగుతోంది. హిందూ మతం ఉండి ఉంటే గిరిజనులను గౌరవించేవారు, దళితులను గౌరవించేవారు, వెనుకబడిన వారిని గౌరవించేవారు. కానీ అది జరగడం లేదు’’ అని అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఏడాది జనవరిలో కూడా స్వామి ప్రసాద్ మౌర్య ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. హిందూ మత గ్రంథం రామచరిత మానస్ ను నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు. రామచరిత మానస్ శూద్రులకు తక్కువ కులాన్ని ఇస్తుందని, తులసీదాస్ తన సంతోషం కోసమే ఈ గ్రంథాన్ని రాశారని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన వ్యాఖ్యలకు అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని పార్టీ మద్దతుగా నిలవలేదు.