ఛత్తీస్ఘడ్ లో ఎన్ కౌంటర్: మావోయిస్టు మృతి
ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలో ఆదివారం నాడు మావోయిస్టులకు, పోలీసులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు.
దంతేవాడ: ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలో ఆదివారం నాడు మావోయిస్టులకు, పోలీసులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు.ఈ నెల 3వ తేదీన బీజాపూర్ రాష్ట్రంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఒక మావోయిస్టు మరణించారు.మావోయిస్టు మిలీషియా కమాండర్ వెట్టి హుంగా మరణించారని పోలీసులు తెలిపారు.
మరికొందరు మావోలు కూడా మరణించారని పోలీసులు అనుమానిస్తున్నారు. హుంగాపై రూ. 4 లక్షల రివార్డు ఉంది. కాల్పులు జరిగిన ప్రాంతంలో 8 ఎంఎం పిస్టల్, నాటు తుపాకీ, 2 కిలోల ఐఈడీ ,విప్లవ సాహిత్యం, కొన్ని మందులను స్వాధీనం చేసుకొన్నారు.వారం రోజుల క్రితం బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో 24 మంది జవాన్లు మరణించారు.
మరో వైపు కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ ను మావోయిస్టులు ఐదు రోజుల పాటు తమ ఆధీనంలో ఉంచుకొన్నారు.అయితే మధ్యవర్తులు చర్చలు జరపడంతో ప్రజా కోర్టులో రాకేశ్వర్ సింగ్ ను మావోయిస్టులు వదిలిపెట్టారు. మావోయిస్టుల చెర నుండి బయటపడిన తర్వాత రాకేశ్వర్ సింగ్ క్షేమంగా తమ బెటాలియన్ వద్దకు చేరుకొన్నారు.