Karnataka Election: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు. ప్రజల నిర్ణయాన్ని అంగీకరిస్తున్నామని అన్నారు. 

Karnataka Election: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తానని, రాబోయే రోజుల్లో పార్టీ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా పనిచేస్తుందని బసవరాజ్ బొమ్మై అన్నారు. కాంగ్రెస్ వ్యవస్థీకృత ఎన్నికల వ్యూహం ఫలించిందనీ, దాని విజయానికి ప్రధాన కారణాలలో అది కూడా ఒకటి అని ఆయన అన్నారు. ఎన్నికల ఫలితాలు తుది దశకు చేరుకున్నాయనీ, ప్రజల ఆదేశాన్ని తాను చాలా గౌరవంగా స్వీకరిస్తున్నానని తెలిపారు.బీజేపీ ఓటమికి తాను బాధ్యత వహిస్తాననీ, మరెవరికీ బాధ్యత లేదనీ, రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను పూర్తి బాధ్యత వహిస్తాను. ఈ ఓటమికి వివిధ కారణాలు ఉన్నందున పూర్తి విశ్లేషణ చేస్తామని బొమ్మై అన్నారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ పనితీరును కూలంకషంగా విశ్లేషిస్తామన్నారు.

అన్ని లోటుపాట్లను అధిగమించి, వ్యవస్థీకృతమై, పార్టీ మరోసారి పుంజుకుంటుంది, మాది జాతీయ పార్టీ అని, మా తప్పులను సరిదిద్దుకోవడం ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో గెలవడానికి సంస్థాగతంగా, పరిపాలనాపరంగా అవసరమైన అన్ని సన్నాహాలు చేస్తామని ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో భాజపా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా పనిచేస్తుందని అన్నారు. ఈ ఎన్నికలలో మోడీ, షా మంత్రం పని చేయలేదా అని అడిగగా.. ఈ పరిణామానికి అనేక కారణాలు ఉన్నాయని, క్షుణ్ణంగా విశ్లేషించిన తర్వాత దాని గురించి మాట్లాడుతానని ముఖ్యమంత్రి అన్నారు.
ఫలితాలు ఇంకా ఖరారు అవుతున్నాయనీ, దాని గురించి ఇప్పుడు మాట్లాడటం సరికాదని అని ఆయన అన్నారు. తనను ఎన్నుకున్నందుకు షిగ్గావ్ అసెంబ్లీ సెగ్మెంట్ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని బొమ్మై అన్నారు.

మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 73.19 శాతం ఓటింగ్ నమోదైంది. ఈరోజు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. రాష్ట్రంలోని 36 కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తాజా ట్రెండ్స్ ప్రకారం, కాంగ్రెస్ 137 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, ఆ పార్టీ 36 స్థానాలను గెలుచుకుంది. మరోవైపు బీజేపీ 45 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, 17 స్థానాల్లో విజయం సాధించింది. జేడీఎస్ 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీలకు అగ్నిపరీక్షగా పరిగణిస్తున్నారు.