వయసులో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు ఫోన్ ని ఎక్కువగా ఉపయోగించడం ఈరోజుల్లో సహజం. ఇలా చేస్తుంటే చదువు పాడైపోతుందనో, పని ఆగిపోతుందనో.. కన్నవాళ్లకి కోపం రావడం సాధారణం. అలాంటి కోపంతోనే ఏకంగా కన్నకూతురిని ఓ తల్లి చంపేసింది.
ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ జిల్లాలోని బడౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిజ్రోల్ గ్రామంలో షాకింగ్ ఘటన జరిగింది. ఇక్కడ ఓ తల్లి తన 15 ఏళ్ల కూతుర్ని గొంతు నులిమి చంపేసింది. కూతురు రాత్రిపూట ఫోన్లో ప్రియుడితో మాట్లాడుతుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని, కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టిందని ఆరోపణలు ఉన్నాయి.
సెహ్రీకి సిద్ధమవుతుండగా గొడవ
శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులు సెహ్రీకి సిద్ధమవుతుండగా, 45 ఏళ్ల వరిసా తన కూతురు నాజియా ఎవరో అబ్బాయితో ఫోన్లో మాట్లాడుతుండటం గమనించింది. ఆమె కోపంతో ఊగిపోయి గొడవకు దిగిందని పోలీసులు తెలిపారు. గొడవ పెద్దదవడంతో వరిసా కోపంతో తన కూతురి గొంతు నులిమి చంపేసింది. పోలీసుల కథనం ప్రకారం, నాజియా ఇంకా బతికే ఉందని వరిసా భావించింది. ఆమె నాటకం ఆడుతోందని భావించి, మంచంపై పడిపోయిన కూతురిని అలాగే వదిలేసి ఇంటి పనుల్లో నిమగ్నమైంది. దాదాపు నాలుగు గంటల తర్వాత ఆమెను నిద్ర లేపేందుకు ప్రయత్నించగా, ఆమె చనిపోయిందని తెలుసుకుంది.
గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తల్లి అరెస్ట్
వరిసా భర్త ఆ సమయంలో సుల్తాన్పూర్లో ఉండగా, ఇంట్లో పిల్లలు, వరిసా మాత్రమే ఉన్నారు. ఈ ఘటన తర్వాత వరిసా నాజియాను రహస్యంగా ఖననం చేయడానికి ప్రయత్నించింది, అయితే గ్రామస్తులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళను అరెస్ట్ చేశారు. పోస్ట్మార్టం రిపోర్టులో నాజియా గొంతు నులమడంతో మరణించినట్లు నిర్ధారణ అయింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నాజియా స్కూల్ మానేసి ఇంట్లోనే ఉండేది. వరిసాకు మొత్తం తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు.