భక్తులకు శునకం ఆశీర్వాదం.. వైరల్ అవుతున్న వీడియో
ఓ గుడిలో మాత్రం భక్తులు స్వామి వారి దర్శనం తర్వాత ఓ కుక్క ఆశీర్వాదం తీసుకుంటారు
గుడికి భక్తులు తరచూ వెళుతూనే ఉంటారు. అలా వెళ్లిన భక్తులు దేవుడికి నమస్కారం చేసుకొని.. పూజారుల ఆశ్వీర్వాదం తీసుకుంటారు. అయితే.. ఓ గుడిలో మాత్రం భక్తులు స్వామి వారి దర్శనం తర్వాత ఓ కుక్క ఆశీర్వాదం తీసుకుంటారు. ప్రత్యేకంగా వాళ్లే వెళ్లి అడగక్కర్లేదు. అక్కడికి వెళితే చాలు.. ఆ శునకమే స్వయంగా ఆశీర్వదిస్తుంది. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
మహారాష్ట్ర అహ్మద్నగర్ జిల్లా సిద్ధతేక్ ప్రాంతంలో ఉన్న సిద్ధివినాయక ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంది. ప్రతిరోజు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఈ ఆలయ ప్రాంగణంలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. గుడి బయట.. మెట్ల పక్కన కాస్త ఎత్తుగా ఉన్న ప్రాంతంలో ఓ కుక్క కూర్చుని ఉంది.
ఇక దర్శనం చేసుకుని బయటకు వచ్చిన భక్తులను పిలిచి మరి షేక్ హ్యాండ్ ఇవ్వడమే కాక ఆశీర్వదించింది. ఈ వింత సంఘటనను కొందరు వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేయ్యడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇక దీన్ని చూసిన నెటిజనులు ‘ఈ వీడియో చూసి మనసుకు ఎంతో ప్రశాంతత లభించింది.. మంచి మనసుతో ఆశీర్వదిస్తుంది’ అంటూ కామెంట్ చేస్తున్నారు.