దేశంలోని నిరుద్యోగం, ఉద్యోగ కల్పనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. యువత ఉద్యోగం ఆశించేవాళ్లుగా కాకుండా.. ఉద్యోగం కల్పించేవారిగా మారితేనే దేశానికి ఉపయోగకరమని ఆయన అన్నారు. 

ఉద్యోగం ఆశించేవాళ్లుగా కాకుండా ఉద్యోగం కల్పించేవాళ్లుగా యువతను తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర విద్యాశాఖ (union education minister) మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan ) . దేశంలోని నిరుద్యోగ సమస్యపై బుధవారం ఆయన స్పందిస్తూ దేశంలో 52.5 కోట్ల మంది 23 ఏళ్లలోపు వారేనని, వీరిలో 35 శాతం మంది విద్యా, నైపుణ్యాలు కలిగిన వారని తెలిపారు. వీరిని కేవలం ఉద్యోగం ఆశించేవాళ్లుగా కాకుండా ఉద్యోగం కల్పించేవాళ్లుగా తీర్చిదిద్దితే మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని ధర్మేంద్ర ప్రధాన్ ఆకాంక్షించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన ‘‘ఎడ్యుకేషన్ సమ్మిట్-2022’ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. అనంతరం సదస్సునుద్దేశించి ఆయన మాట్లాడుతూ మన దేశంలో 25 కోట్ల మంది స్కూలుకు వెళ్లే చిన్నారులు ఉన్నారని తెలిపారు. 4 కోట్ల మంది విద్యార్థులు ఉన్నత విద్యను పూర్తి చేశారని వెల్లడించారు. ఇక ఒకేషనల్, ఐటీఐ, స్కిల్లింగ్, లాంటి కోర్స్‌లు పూర్తి చేసిన వారు 3 నుంచి 4 కోట్లు ఉన్నారని కేంద్ర మంత్రి తెలిపారు. మొత్తంగా సిస్టమ్‌ను చేరుకునే విద్యార్థులు 34 నుంచి 35 కోట్ల మంది ఉన్నారని చెప్పారు. అయితే వీరంతా కేవలం ఉద్యోగులుగా మారితే దేశానికి ఉపయోగం ఏమి వుండదని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. అలా జరిగితే వినియోగ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని.. దీనిని మనం యజమాని ఆర్థిక వ్యవస్థగా, వ్యవస్థాపక ఆర్థిక వ్యవస్థగా మార్చాలని కేంద్రమంత్రి పిలుపునిచ్చారు.