మహిళలు మంత్రులు కాలేరు.. పిల్లలను కనడానికి పరిమితమవ్వాలి: తాలిబాన్
తాలిబాన్లు పిల్లను కంటే సరిపోతుందని, వారు క్యాబినెట్లో ఉండాల్సిన ఆవశ్యకత లేదని తాలిబాన్ ప్రకటించింది. మంత్రి బాధ్యతలను వారు మోయలేరని, వారి మెడపై భారంగా ఉంటాయని తెలిపారు. గత 20ఏళ్లలో సంపాదించుకున్న హక్కులను కోల్పోతామన్న భయాలతో కొన్ని రోజులు మహిళలు ఆందోళనలు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వంతో తమకూ ప్రాతినిధ్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన ప్రభుత్వం ఏర్పాటు ప్రకటనకు ముందు నుంచే మహిళలు అక్కడ ఆందోళనలు చేస్తున్నారు. నూతన ప్రభుత్వంలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రాణాలు పణంగా పెట్టి నిరసనలు చేస్తున్నారు. తాలిబాన్లు మాత్రం వారి డిమాండ్లు వినడం కాదు కదా.. వారి ఆందోళనలపైనే విరుచుకుపడుతున్నారు. ఆందోళనలు చేస్తున్న మహిళలపై కర్రలతో దాడులు చేస్తున్నారు. వారి ఆందోళనలను కవర్ చేస్తున్న జర్నలిస్టులపైనా క్రూరంగా దాడి చేస్తున్నారు. తాజాగా తాలిబాన్ ప్రతినిధి ఆఫ్ఘనిస్తాన్ క్యాబినెట్లో మహిళలు చోటు ఉండే అవకాశమే లేదని కరాఖండిగా చెప్పారు.
అందరూ పురుషులే ఉన్న తాలిబాన్ ప్రభుత్వంలో మహిళలకు చోటు కల్పించే మాటే లేదని తాలిబాన్ ప్రతినిధి సయ్యద్ జెక్రుల్లా హషిమి టోలో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. మహిళలు క్యాబినెట్లో ఉండాల్సిన అవసరం లేదని, వారు పిల్లలను కనాలని వివరించారు. అంతేకాదు, ఇప్పుడు ఆందోళన చేస్తున్న మహిళలు ఆఫ్ఘనిస్తాన్లోని మహిళలనందరినీ ప్రతిబింబించరని అన్నారు.
అసలు మహిళలు క్యాబినెట్లో ఉండాల్సిన ఆవశ్యకత ఏమిటని న్యూస్ ప్రెజెంటర్ను అడిగారు. వారు కూడా సమాజంలో సగం కదా.. అని చెప్పగా తాము అలా భావించడం లేదని హషిమి స్పష్టం చేశారు. అసలు అర్థభాగం అనే పదాన్నే వక్రీకరించారని సొంత వివరణ ఇచ్చారు.
గత 20ఏళ్ల అమెరికా కీలుబొమ్మ ప్రభుత్వ హయాంలో మహిళలు కార్యాలయాల్లో ఏం చేశారని ప్రశ్నించారు. ఆఫీసుల్లో వ్యభిచారం జరిగిందని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ మహిళలందరూ వ్యభిచారం చేశారని చెప్పలేం కదా అని న్యూస్ ప్రెజెంటర్ అనగా, ఆందోళనలు చేస్తున్న మహిళలూ అందరినీ ప్రతిబింబించడం లేదని చెప్పారు. మహిళలు పిల్లలను కనాలని, వారిని విద్యావంతులు చేయాలని, పెంచి పెద్దచేయాలని అని అన్నారు. అంతేకానీ, క్యాబినెట్లో మంత్రులు కావాల్సిన అవసరం లేదని వివరించారు. క్యాబినెట్ మంత్రి పదవిని వారు మోయలేరని, అది వారి తలపై భారమవుతుందని తెలిపారు.