ఇదేం విడ్డూరం.. కౌగిలించుకున్నాడని కోర్టు కెక్కింది.. తీర్పు ఏం చెప్పారంటే...
ఓ వ్యక్తి తన సహోద్యోగిని సరదాగా కౌగిలించుకున్నాడు. అయితే ఆ కౌగిలి ఆమె పాలిట ధృతరాష్ట్ర కౌగిలిగా మారింది. పక్కటెముకలు ఫట ఫటా విరిగిపోయాయి. దీంతో ఆమె కోర్టుకెక్కింది.
చైనా : కొన్ని విషయాలు చదువుతుంటే విచిత్రంగా అనిపిస్తుంది. ఇలా కూడా ఉంటారా..? అని ముక్కుమీద వేలేసుకుని మరీ ఆశ్చర్యపోతారు. అయితే గమ్మత్తుగా జరిగినా.. ఇలాంటి ఘటనల వల్ల ఎదుటివ్యక్తి ఎంత ఇబ్బందికి గురైతే ఇది వెలుగులోకి వస్తుందో అర్థం కాదు. అలాంటి ఓ విచిత్రమైన సంఘటన చైనాలో చోటు చేసుకుంది. మొదట అందరూ.. ఇదేం విడ్డూరం? అనుకున్నారు. అయితే ఆ మహిళకు జరిగింది తెలుసుకుని, కోర్టు తీర్పు విన్నాక.. అరెరే.. ఎంత పని జరిగిపోయిందీ అనుకున్నారు. అదేంటంటే...
తనను గట్టిగా కౌగిలించు కోవడంపై కోపగించుకున్న ఓ మహిళ ఏకంగా కోర్టు మెట్లెక్కింది. ఈ వింత ఘటన చైనాలో చోటుచేసుకుంది. యుయాంగ్ నగరంలోని హునాన్ ప్రావిన్స్ కు చెందిన మహిళ ఆఫీసులో ఉండగా.. మగ సహోద్యోగి ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. అతని కౌగిలింతతో ఆమె నొప్పితో విలవిల్లాడిపోయింది. గట్టిగా కేకలు వేసింది. అతనిది ధృతరాష్ట్ర కౌగిలి మరి. అతను విడిచిపెట్టిన తరువాత కూడా ఆమెకు ఛాతిలో నొప్పి రావడంతో తాత్కాలికంగా ఆయిల్ మసాజ్ చేసుకుని ఉపశమనం పొందింది.
Kabul Mosque: కాబూల్ మసీదులో భారీ పేలుడు.. భారీగా ప్రాణనష్టం !
అయితే ఐదు రోజుల తర్వాత ఛాతిలో నొప్పి ఎక్కువ కావడంతో ఆసుపత్రికి వెళ్ళింది. వైద్యులు ఎక్స్ రే తీయగా అందులో మహిళకు మూడు పక్కటెముకలు విరిగినట్లు తేలింది. కుడి వైపున రెండు, ఎడమ వైపున ఒకటి విరిగిపోయాయి. మహిళ ఆసుపత్రి బిల్లులకు భారీగా డబ్బు ఖర్చు అయింది. అంతేకాక ఆమె ఉద్యోగానికి కూడా వెళ్లలేని పరిస్థితి రావడంతో ఆదాయాన్ని కోల్పోయింది. ఆ తర్వాత కోలుకుంటున్న సమయంలో సదరు మహిళ తనను హగ్ చేసుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్లి తన పరిస్థితిని తెలిపింది. అయితే ఆ వ్యక్తి తన కౌగిలింత వల్ల ఇంత గాయం అయ్యిందా? రుజువు ఏంటని ఆమెను ఎదురు ప్రశ్నించాడు.
దీంతో అవాక్కయిన ఆమె.. ఏం చేయాలో పాలుపోక.. చివరికి తన సహోద్యోగిపై కోర్టులో దావా వేసింది. తన ఆర్థిక నష్టాలకు పరిహారం ఇవ్వాల్సిందిగా కోరింది. ఈ కేసును విచారించిన కోర్టు పదివేల యువాన్లు (రూ.1.16లక్షలు) పరిహారంగా చెల్లించాలని సహోద్యోగిని న్యాయమూర్తి ఆదేశించారు. ఆ అయిదు రోజుల్లో ఎముకలు విరగడానికి కారణమయ్యే ఏ కార్యకలాపాల్లోనూ మహిళ పాల్గొన్నట్లు రుజువు చేసేందుకు ఎలాంటి ఆధారాలు లేవు అని కోర్టు పేర్కొంది.