గాజాలో ఆకలి సంక్షోభంపై డబ్ల్యూహెచ్‌వో తీవ్ర ఆందోళన  వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ ఆహారాన్ని ఆయుధంగా మార్చొద్దని సూచించింది.

గాజా పై ఇజ్రాయెల్‌ ఏ రేంజ్‌ లో విరుచుకుపడుతుందో తెలిసిన విషయమే.ఈ దాడుల్లో సాధారణ పౌరులు వందల సంఖ్యలో చనిపోతున్నారు. మరోవైపు, గాజాలో ఆకలి సంక్షోభం విలయతాండవం చేస్తోంది. ఈ పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. శరణార్థులకు అందించే ఆహారాన్ని ఆయుధంగా మార్చుకోవడం నేరమని, ఇజ్రాయెల్‌ కాస్త దయచూపించాలని చెప్పింది. ఈ మేరకు వార్షిక సమావేశంలో డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ భావోద్వేగభరితంగా మాట్లాడారు.

ఇరువైపులా శాంతి అవసరం…

‘‘ప్రస్తుతం గాజా లోని ప్రజల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోగలను. వారి బాధ నాకు తెలుస్తోంది. యుద్ధం కారణంగా నెలకొన్న భయానక పరిస్థితులు ప్రజలను మానసికంగా క్షోభకు గురిచేస్తున్నాయి. అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. యుద్ధ సమయాల్లో ఆహారాన్ని ఆయుధంగా చేసుకోవడం అనేది మహా నేరం. వైద్య సదుపాయాలను అడ్డుకోవడం తప్పు. ఈ యుద్ధం ఇజ్రాయెల్‌కు కూడా మంచిది కాదు. ఇరువైపులా శాంతి అవసరం.

ఘర్షణలతో శాశ్వత పరిష్కారం లభించదు. గాజాలోని ప్రజలపై దయచూపించాలని టెల్‌అవీవ్‌ను కోరుతున్నా. ఇది ఇరువర్గాలకు, మానవాళికి మంచిది’’ అని టెడ్రోస్‌ పేర్కొన్నారు. గాజాలో నెలకొన్న ఆకలి సంక్షోభంపై డబ్ల్యూహెచ్‌వో అత్యవసర డైరెక్టర్‌ మైఖేల్‌ ర్యాన్‌ కూడా స్పందించారు. ప్రస్తుతం ఈ నగరంలో 2.1 మిలియన్ల మంది ప్రజల జీవితం ప్రమాదంలో పడినట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆకలిని తీర్చాలని, హమాస్‌ చెరలోని ఇజ్రాయెల్‌ బందీలను విడుదల చేయాలని కోరారు.

ఇక, ఈ ప్రాంతంలో 94 శాతం ఆస్పత్రులు పూర్తిగా దెబ్బతిన్నట్లు ఐక్యరాజ్యసమితి ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం 36 ఆస్పత్రుల్లో 19 మాత్రమే పనిచేస్తున్నాయని వెల్లడించింది. అక్కడ తాత్కాలిక ఆస్పత్రులు ఏర్పాటు చేసినా దాడుల కారణంగా అవి ధ్వంసం అవుతాయని, వెంటనే ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. గాజాలోకి 200 ట్రక్కులు ప్రవేశిస్తే ఇప్పటివరకు 90 ట్రక్కుల మానవతా సాయం మాత్రమే స్వచ్ఛంద సంస్థలకు అందిందని యూఎన్‌ తెలిపింది.

2023 అక్టోబర్‌ నుంచి ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య జరుగుతోన్న పోరులో 53 వేల మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక యంత్రాంగం వెల్లడించింది. గాజా ప్రాంతంలో మానవతా సాయాన్ని పరిమితంగా అందించేందుకు ఇజ్రాయెల్‌ అనుమతిచ్చింది. అయితే, ఇది అక్కడి ప్రజలకు ఏ మాత్రం సరిపోదనే ఆందోళనలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు.. గాజా మొత్తాన్ని తమ నియంత్రణలోకి తీసుకుంటామని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘మా పోరాటం తీవ్రస్థాయిలో ఉంది. పురోగతి సాధిస్తున్నాం. ఆ ప్రాంతం మొత్తాన్ని నియంత్రణలోకి తీసుకుంటాం. ఇందులో వెనక్కి తగ్గేదేలేదు’’ అని వెల్లడించారు.