పాకిస్థాన్ భూభాగంలో భారత క్షిపణి పడిన ఘటనపై పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్ తొలిసారిగా స్పందించారు. క్షిపణి ఘటనపై తాము సంయమనం పాటించామని తెలిపారు. ఈ ఘటనపై తాము వెంటనే ప్రతిస్పందించే అవకాశం ఉన్నప్పటికీ అలా చేయలేదని చెప్పారు. 

తమ దేశంలోని పంజాబ్‌ ప్రావిన్స్ (Punjab province)లో భార‌త క్షిపణి దిగిన వెంట‌నే పాకిస్థాన్ (Pakistan) ఇండియా (India)కు ధీటుగా ప్రతిస్పందించవచ్చని, అయితే తాము అలా చేయ‌కుడా సంయమనం పాటించామ‌ని పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ (Pakistan Prime Minister Imran Khan) అన్నారు. మార్చి 9వ తేదీన నిరాయుధ భారత సూపర్‌సోనిక్ క్షిపణి (Indian supersonic missile) పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించింది. లాహోర్‌కు 275-కిమీ దూరంలో ఉన్న మియాన్ చన్ను సమీపంలోని ప్రైవేట్ వ్య‌క్తి కి చెందిన ప్ర‌దేశంలో ప‌డింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

భార‌త క్షిప‌ణి పాక్ భూభాగంలోకి ప్ర‌వేశించిన ఘ‌ట‌న‌పై తొలిసారిగా ఆ దేశ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ తొలిసారిగా స్పందించారు. ‘‘ మియాన్ చన్ను (Mian Channu)లో భారత క్షిపణి పడిపోయిన తర్వాత మేం ప్రతిస్పందించగలిగినప్పటికీ మేము సంయమనం పాటించాము ’’ అని ప్రధాని అన్నారు. ఉమ్మడి ప్రతిపక్షం ఇమ్రాన్ ఖాన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం పంజాబ్‌లోని హఫీజాబాద్ జిల్లాలో జరిగిన బహిరంగ ర్యాలీలో ఆయన ప్రసంగించారు.

ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ రక్షణ సంసిద్ధత గురించి కూడా మాట్లాడాడు. ‘‘ మనం మన రక్షణ, దేశాన్ని బలోపేతం చేయాలి.’’ అని వ్యాఖ్యానించారు. అంతకు ముందు పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ల్యాండ్ అయిన క్షిపణి విషయంలో భారతదేశం ఇచ్చిన వివ‌ర‌ణ‌తో సంతృప్తి చెంద‌లేద‌ని పాకిస్థాన్ విదేశాంగ కార్యాల‌యం శ‌నివారం తెలిపారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వాస్త‌వాల‌ను ఖ‌చ్చితంగా నిర్ధారించ‌డానికి సంయుక్త ద‌ర్యాప్తును చేప‌ట్టాల‌ని డిమాండ్ చేసింది. 

క్షిప‌ణి పాక్ లో ప‌డిన వెంట‌నే ఇది ప్ర‌మాద‌వ‌శాత్తు జ‌రిగింద‌ని ఇండియా పేర్కొంది. అయితే దీనిపై పాక్ అసంతృప్తి వ్య‌క్తం చేసింది. ‘‘ క్షిపణి పాకిస్థాని భూభాగంలోకి దిగినప్పటి నుంచి వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు ఈ ఘటనపై జాయింట్ ఎంక్వేరి చేప‌ట్టాల‌ని పాకిస్థాన్ న్యూఢిల్లీకి ప్రతిపాదించింది’’ అని పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం (FO) పేర్కొంది. ప్రమాదవశాత్తు ప్రయోగించిన విషయం గురించి వెంటనే పాకిస్థాన్‌కు తెలియజేయడంలో భారత్ ఎందుకు విఫలమైందని ప్రశ్నించింది. భార‌త‌దేశ రక్షణకు సంబంధించి ప్రశ్నలు లేవనెత్తింది. కాగా సాంకేతిక లోపం కారణంగా రొటీన్ మెయింటెనెన్స్ ఆపరేషన్ సమయంలో మిస్సైల్ ‘ప్రమాదవశాత్తూ పేల్చబడిందని’ భారత్ తెలిపింది. ఈ ఘటనపై హై-లెవల్ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ (high-level court of enquiry)కి ఆదేశించినట్లు ప్రకటించింది. 

నిరాయుధ భారత క్షిపణి పాకిస్థాన్‌లో ల్యాండ్ అయిన తర్వాత మార్చి 12వ తేదీన భారత్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. భారతదేశం అనుకోకుండా పాకిస్థాన్ భూభాగంలో భారత క్షిపణిని ప్రయోగించిందని తెలిపింది. ఈ ఘ‌ట‌న మార్చి 9న నివేదించబడింద‌ని తెలిపింది. పాకిస్తాన్ లో ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని పేర్కొంది. రొటీన్ మెయింటెనెన్స్ సమయంలో సాంకేతిక లోపమే ఈ ఘటనకు దారితీసిందని కేంద్రం పేర్కొంది. ఈ ఘటనపై ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. కేంద్ర ప్ర‌భుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారీ ఈ ప్రమాదంపై స్పందించారు. ఈ ఘ‌ట‌న పెద్ద చిక్కులను కలిగిస్తుందని తెలిపారు.