వాల్మార్ట్ స్టోర్పై దాడి బెదిరింపుల విమానం సురక్షితంగా ల్యాండ్.. పోలీసుల అదుపులో పైలట్
అమెరికా: విమానంతో మిస్సిస్సిప్పి లోని వాల్మార్ట్ స్టోర్ పై దాడి చేస్తానని బెదిరించిన పైలట్ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విమానం ఉదయం 5 గంటల నుంచి ఆ ప్రాంతంలో చక్కర్లు కొట్టింది. అక్కడి భద్రతాధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
అమెరికా: మిస్సిస్సిప్పి లోని వాల్మార్ట్పై విమానంతో దాడి చేస్తానని బెదిరించిన పైలట్ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర మిస్సిస్సిప్పి మీదుగా తిరుగుతున్న ఒక విమానం-దాని పైలట్ వాల్మార్ట్ స్టోర్ ను క్రాష్ చేస్తానని బెదిరించిన ఒక విమానం శనివారం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని అధికారులు తెలిపారు. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
వివరాల్లోకెళ్తే.. యునైటెడ్ స్టేట్స్లోని ఉత్తర మిస్సిస్సిప్పి లోని టుపెలో అనే నగరం మీదుగా దొంగిలించబడిన విమానాన్ని గంటల తరబడి తిరుగుతున్న పైలట్.. ఆ ప్రాంతంలో ఉన్న వాల్మార్ట్ స్టోర్ను క్రాష్ చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఈ క్రమంలోనే అప్రమత్తమైన అధికారులు.. వాల్ మార్ట్ లోని సిబ్బంది, వినియోగదారులను ఖాళీ చేయించారు. అలాగే, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోకి ప్రజలు ఏవరూ రాకూడదని పేర్కొంటూ.. అక్కడి ఇండ్లను ఖాళీ చేయించారు. క్రాష్ బెదిరింపుల నేపథ్యంలో రంగంలోకి దిగిన అక్కడి పోలీసు యంత్రాంగం, భద్రతా బలగాలు చర్యలు తీసుకున్నారు. సురక్షితంగా విమానం ల్యాండింగ్ కు చర్యలు తీసుకోవడంలో సఫలం అయ్యారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసిన తర్వాత పైలట్ ను అదుపులోకి తీసుకున్నట్లు గవర్నర్ టేట్ రీవ్స్ తెలిపారు. "పరిస్థితి పరిష్కరించబడింది.. ఈ ఆపరేషన్ లో ఎవరూ గాయపడలేదు" అని గవర్నర్ టేట్ రీవ్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
"ఉత్తర మిస్సిస్సిప్పి మీదుగా తిరుగుతూ.. వాల్ మార్ట్ క్రాష్ కు పాల్పడుతానంటూ బెదిరింపులకు దిగిన విమానం సురక్షితంగా ల్యాండ్ చేయబడింది. పరిస్థితి పరిష్కరించబడింది.. ఈ ఆపరేషన్ లో ఎవరూ గాయపడలేదు.. భద్రతా బలగాలకు కృతజ్ఞతలు. ఈ పరిస్థితిని అత్యంత వృత్తి నైపుణ్యంతో నిర్వహించిన స్థానిక, రాష్ట్ర-సమాఖ్య యంత్రాంగం చర్యలకు ధన్యవాదాలు" అని రీవ్స్ ట్వీట్ చేశారు.
వాల్ మార్ట్ ను ఢీ కొడతానంటూ బెదిరింపులకు దిగిన ఈ విమానం బీచ్క్రాఫ్ట్ కింగ్ ఎయిర్ 90.. ఐదు గంటలకు పైగా గాలిలో చక్కర్లు కొడుతూ.. అక్కడి అధికారులు, ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. దీనిని పోలీసులు ప్రమాదకరమైన పరిస్థితిగా అభివర్ణించారు. గాలిలో విమానం చక్కర్లు కొడుతున్న సమయంలో పోలీసులు పైలట్తో చర్చలు జరుపుతున్నప్పటికీ.. ఆ వ్యక్తి గుర్తింపు లేదా దాడి వెనుక ఉద్దేశంపై ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అంతకుముందు, టుపెలో పోలీస్ డిపార్ట్మెంట్ పౌరులను అన్ని క్లియర్ అయ్యే వరకు ఆ ప్రాంతానికి దూరంగా ఉండమని కోరింది.
కాగా, విమానాన్ని నడిపిన పైలట్ టుపెలో రీజినల్ ఎయిర్పోర్ట్ ఉద్యోగి అని స్థానిక వార్తాపత్రిక డైలీ జర్నల్ నివేదించింది.