ట్రంప్ సుంకాలపై యూఎస్ కోర్టు తాత్కాలికంగా తీర్పు నిలిపివేసింది. జూన్ 9లోగా ప్రభుత్వ స్పందన కోరింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కొన్ని కీలక వాణిజ్య నిర్ణయాలకు యూఎస్ కోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచంలోని అనేక దేశాలపై ట్రంప్ విధించిన అధిక సుంకాలపై గతంలో అమెరికాలోని ట్రేడ్ కోర్టు అభ్యంతరం తెలిపింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ట్రంప్ ప్రభుత్వం అప్పీల్ చేసిందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజా పరిణామంలో మరొక ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా ట్రేడ్ కోర్టు తీర్పు అమలును నిలిపివేసింది.
వివరాల్లోకి వెళ్తే, ట్రంప్ ప్రభుత్వం ఏప్రిల్ 2న ‘లిబరేషన్ డే’ పేరుతో కొన్ని దేశాలపై భారీగా దిగుమతి సుంకాలు విధించింది. ఈ నిర్ణయాన్ని విమర్శిస్తూ పలు వాణిజ్య సంస్థలు న్యూయార్క్లోని అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టును ఆశ్రయించాయి. అధ్యక్షుడికి ఉన్న అధికారాలు ఎంతవరకు ఉపయోగించుకోవచ్చన్న అంశంపై ఆ కోర్టు విచారణ జరిపింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే విదేశీ దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించవచ్చని, ట్రంప్ నిర్ణయం ఆ పరిధిలోకి రాదని కోర్టు స్పష్టం చేసింది.
ఈ తీర్పును నిలిపివేయాలని కోరుతూ ట్రంప్ సర్కారు మరో కోర్టును ఆశ్రయించింది. తమ వాదనలో భాగంగా, ప్రస్తుతం పలు దేశాలతో సుంకాలపై చర్చలు జరుగుతున్నాయని, ఈ డీల్స్పై నిర్ణయానికి జులై 7 వరకు గడువు ఉందని పేర్కొంది. అంతవరకూ ఈ వ్యవహారాన్ని సున్నితంగా చూడాలని కోర్టును కోరింది.
అంతేగాక, టారిఫ్ అధికారంతోనే ట్రంప్ ఇటీవల భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ సాధించగలిగారని కూడా ప్రభుత్వ న్యాయవాదులు వాదించారు. అయితే కోర్టు ఈ వాదనలను తోసిపుచ్చింది. ఇప్పటివరకు ట్రంప్ ప్రభుత్వం సమర్పించిన అన్ని విషయాలను విశ్లేషించిన కోర్టు, ఫిర్యాదుదారులు జూన్ 5లోగా, పరిపాలనాధికారులు జూన్ 9లోగా తమ అభిప్రాయాలను సమర్పించాలని తెలిపింది.
ఈ తీర్పుతో ట్రంప్ తీసుకున్న వాణిజ్య నిర్ణయాలపై మరోసారి చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. జులై 7నుండి ముందే కీలక ట్రేడ్ డీల్స్ ఖరారవుతాయా, లేక ఇంకెన్ని చట్టపరమైన సవాళ్లు ఎదురవుతాయన్నది తేలాల్సి ఉంది.