పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. అయితే ఈ దాయాది దేశాల మధ్య ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితి రియాక్ట్ అయ్యింది. 

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్‌ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అమాయక టూరిస్టులపై ఉగ్రవాదుల కాల్పుల వెనక పాకిస్థాన్ హస్తం ఉందని భారత్ బలంగా చెబుతోంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్ పై భారత్ ఆంక్షలు విధించింది... పాక్ కూడా అదేపని చేసింది. ఇలా ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి యుద్దవాతావరణం నెలకొనడంతో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుంది.  

యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ 'మిలిటరీ చర్య సమస్యకు పరిష్కారం కాదు' అని భారత్, పాక్ ను సూచించారు. ఇరుదేశాలు సంయమనం పాటించాలని ఆయన కోరారు.ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్య విధానాలను వాడుకోవాలని.. శాంతికి కట్టుబడి ఉండాలని సూచించారు. ఇందుకోసం యుఎన్ పూర్తి మద్దతును ఇస్తుందని గుటెర్రస్ రెండు దేశాలకు సలహా ఇచ్చారు.

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని యూఎన్ ఖండిస్తుందని గుటెర్రస్ అన్నారు. ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమవడం... అప్పటికే బలహీనంగా ఉన్న సంబంధాలు మరింత దెబ్బతినడంపై గుటెర్రస్ విచారం వ్యక్తం చేశారు.

'భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు చాలా సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా ఉన్నాయి. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి తర్వాత బాధను అర్థం చేసుకోగలను. నేను మరోసారి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను, బాధితుల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. పౌరులను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదు, బాధ్యులను న్యాయం ముందుకి తీసుకురావాలి' అని గుటెర్రస్ అన్నారు.

'ఈ క్లిష్ట సమయంలో నియంత్రణ కోల్పోవద్దు... ఇరుదేశాలు సైనిక ఘర్షణను తప్పించుకోవడం చాలా ముఖ్యం. సంయమనం పాటిస్తే ఉద్రిక్తతలను తగ్గించుకుని వెనక్కి తగ్గాల్సిన సమయం ఇది.  ఇందుకోసం భారత్, పాక్ తో నా సంప్రదింపులు కొనసాగుతాయి. మిలిటరీ చర్యలు సమస్యకు పరిష్కారం కాదనేదు నా సందేశం. ఉద్రిక్తతలను తగ్గించే దౌత్యం, శాంతికి తిరిగి కట్టుబడి ఉండే ఏ చొరవకైనా యునైటెడ్ నేషన్స్ మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది' అని గుటెర్రస్ అన్నారు.