Ukraine War: రష్యాను ఒంటరి చేయడం అసాధ్యం.. పుతిన్ వార్నింగ్.. ఉక్రెయిన్ వేర్పాటుదళాలు చేతికి లైమాన్ !
Russia Ukraine Crisis: ఉక్రేయిన్ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రెండు దేశాలకు భారీగా నష్టం జరగడంతో పాటు యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతోంది.
Russia Ukraine Crisis: ఉక్రెయిన్ ను పూర్తిగా తమ స్వాధీనం లోకి తీసుకునేంత వరకు రష్యా దాడులు ఆపేలా కనిపించడం లేదు. ఇప్పటికే రెండు దేశాలకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. మరీ ముఖ్యంగా ఉక్రెయిన్ పరిస్థితి దారుణంగా మారింది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్లోని రష్యా-మద్దతుగల వేర్పాటువాద దళాలు శుక్రవారం కైవ్ నియంత్రణలో ఉన్న కీలకమైన తూర్పు నగరాలకు దారితీసే రహదారిపై ఉన్న వ్యూహాత్మక పట్టణమైన లైమాన్ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించాయి. ఈ నగరం రెండు దేశాలకు కీలకంగా ఉండటంతో ఇప్పుడు ఉక్రెయిన్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. రష్యన్ దళాలతో కలిసి, వేర్పాటువాద శక్తులు "క్రాస్నీ లిమాన్తో సహా 220 స్థావరాలను పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నాయి" అని డోనెట్స్క్ నుండి విడిపోయిన ప్రాంతం తన టెలిగ్రామ్ ఛానెల్లో పట్టణానికి పాత పేరును ఉపయోగించి తెలిపింది.
అయితే, దీనిపై ఇటు ఉక్రెయిన్ గానీ, అటు రష్యా గానీ అధికారిక ప్రకటన చేయలేదు. తూర్పు దొనేత్సక్ ప్రాంతానికి ఉత్తరాన ఉన్న లైమాన్ ఉక్రేనియన్-నియంత్రిత డోనెట్స్క్ రాజధాని స్లోవియన్స్క్ మరియు క్రామాటోర్స్క్లకు వెళ్లే రహదారిపై ఈ పట్టణం ఉంది. రష్యా సరిహద్దుకు సమీపంలో మరియు క్రెమ్లిన్ అనుకూల వేర్పాటువాదులకు నిలయంగా ఉన్న డాన్బాస్ ప్రాంతంలో, అలాగే దక్షిణ తీరప్రాంతంలో తన లాభాలను భద్రపరచడం మరియు విస్తరించడంపై ఉక్రెయిన్లో మాస్కో దృష్టి సారించిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇదిలావుండగా, నాటోలో చేరుతామంటూ పేర్కొంటున్న అన్ని దేశాలను రష్యా హెచ్చరిస్తోంది. నాటో చేరితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తోంది. ప్రస్తుతం ఉక్రెయిన్ ఆక్రమణపై రష్యాకు మద్దతుగా నిలిస్తున్న చెచెన్ నేత రంజాన్ కదిరోవ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
రంజాన్ కదిరోవ్ ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై మాట్లాడిన వీడయో ఒకటి వైరల్ గా మారింది. ఆ వీడియోలో.. ‘ఉక్రెయిన్ సమస్య ముగిసింది. తర్వాత పోలాండ్ పట్ల ఆసక్తిగా ఉన్నది’ అని అన్నారు. ‘ఉక్రెయిన్ అనంతరం.. ఒకవేళ మాకు ఆదేశాలు వస్తే.. ఆరు సెకండ్లలో ఏం చేయగలమో చేసి చూపుతాం’ అంటూ పోలాండ్ను హెచ్చరించారు. ఉక్రెయిన్కు సరఫరా చేస్తున్న ఆయుధాలను వెనక్కి తీసుకోవాలని ఆ దేశాన్ని బెదిరించారు. ‘విక్టరీ డే’ సందర్భంగా పోలాండ్లో రష్యా రాయబారిపై ఎరుపు సిరా దాడిని ఖండించారు. దీనిపై పోలాండ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదిలావుండగా, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ పై దాడి విషయంలో వెనక్కి తగ్గడం లేదు. రష్యా ను ఒంటరి చేయడం అసాధ్యం అంటూ పశ్చిమ దేశాలకు గురువారం నాడు గట్టి వార్నింగ్ ఇచ్చారు. రష్యాను ఒంటరి చేయాలనే ప్రయత్నంలో ఆయా దేశాలు తమను తాము గాయపరుచుకుంటాయని పేర్కొన్నారు. ప్రపంచ ఆహారం మరియు ఇంధన సరఫరా తీవ్రంగా దెబ్బతినడంతో ఉక్రెయిన్ యుద్ధం నాల్గవ నెలలో ముగుస్తున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకంఉది. అయితే కనికరంలేని పుతిన్ మాత్రం ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఇంతలో, ఉక్రెయిన్కు చెందిన వోలోడిమిర్ జెలెన్స్కీ క్రెమ్లిన్ డాన్బాస్లో జాతి నిర్మూలనకు పుతిన్ ప్రయత్నింస్తున్నారని ఆరోపించారు.