అభ్యంతరకరంగా కాళీ మాత ఫోటో.. ఉక్రెయిన్ రక్షణ శాఖ ట్వీట్ వైరల్, భగ్గుమన్న భారతీయులు
భారతీయుల ఆరాధ్య దైవం కాళీ మాత ఫోటోను అసభ్యకరంగా చిత్రీకరించి పోస్ట్ చేసిన ట్వీట్ పై భారతీయులు భగ్గుమన్నారు. దీంతో ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ దిగొచ్చింది.
ఉక్రెయిన్ డిఫెన్స్కు చెందిన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి వచ్చిన ఓ పోస్ట్ వివాదాస్పదమవుతోంది. పేలుడు కారణంగా గాల్లోకి లేచిన పొగను మార్ఫింగ్ చేసి.. దానికి హిందువుల ఆరాధ్య దైవం కాళీ మాతను ఫోటోను అసభ్యంగా పెట్టి చేసిన పోస్ట్పై భారతీయులు భగ్గుమంటున్నారు. ఈ చర్యను హిందూ ఫోబిక్గా అభివర్ణిస్తూ .. నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. వర్క్ ఆఫ్ ఆర్ట్ అంటూ కాళీ మాతను హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో మాదిరిగా మార్ఫింగ్ చేసి.. అసభ్యకర రీతిలో వున్న ఫోటోను ఉక్రెయిన్ డిఫెన్స్ ఆదివారం ట్వీట్ చేసింది. నీలి రంగు చర్మం, నాలుకను బయటపెట్టిన భంగిమ, మెడ చుట్టూ పుర్రెల దండతో అచ్చుగుద్దినట్లు కాళీమాతను పోలినట్లుగా వున్న ఆ వ్యంగ్య చిత్రం హిందూ సంస్కృతిని అపహాస్యం చేసేలా వుందంటూ భారతీయులు ఉక్రెయిన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీని వల్ల భారత్ నుంచి మీకు ఎలాంటి మద్ధతు లభించదని.. గాడిదను తన్నినట్లు తన్నడం తప్ప అంటూ మోహన్ సిన్హా అనే వినియోగదారులు మండిపడ్డాడు.
సుధాన్షు సింగ్ అనే మరో యూజర్ కూడా ఉక్రెయిన్ చర్యను ఖండించాడు. భారతీయుల ఆరాధ్య దేవత అయిన కాళీ మాతను ఉక్రెయిన్ డిఫెన్స్ హ్యాండిల్ వెక్కిరించడం చూసి తాను భయపడిపోయానని కామెంట్ చేశాడు. దీనికి తక్షణం క్షమాపణలు చెప్పాల్సిందిగా ఆయన డిమాండ్ చేశాడు. అన్ని మాతాలు, విశ్వాసాలను గౌరవించడం నేర్చుకోవాలంటూ సుధాన్షు చురకలంటించాడు.
ఇలాంటి కార్టూన్లు వేసి తమ విశ్వాసాన్ని అవమానించినందుకు సిగ్గుపడాలని.. ఇది అసహ్యారమైన ప్రయత్నమని మరో వినియోగదారుడు మండిపడ్డాడు. అంతేకాదు.. తక్షణం ఉక్రెయిన్పై చర్య తీసుకోవాలంటూ ట్విట్టర్ వినియోగదారులు ఎలాన్ మస్క్, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్లను ట్యాగ్ చేశారు. ఈ దెబ్బకు ఉక్రెయిన్ డిఫెన్స్ మంత్రిత్వ శాఖ తన అధికారిక ఖాతా నుంచి ఆ పోస్ట్ను తొలగించింది.