సారాంశం
హిందువులు ఎంతగానో ఆరాధించే కాళీమాత ఫొటోను ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ అసభ్యకరమైన రీతిలో ప్రొజెక్ట్ చేస్తూ ట్వీట్ చేసింది. దీనిపై భారతీయుల నుంచి ఆగ్రహం వ్యక్తం అయ్యింది. దీంతో ఆ ట్వీట్ ను ఉక్రెయిన్ తొలిగింది. భారతదేశానికి క్షమాపణలు చెప్పింది.
ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ కాళీమాత ఫోటోను అసభ్యకర రీతిలో ట్వీట్ చేసినందుకు ఆ దేశ డిప్యూటీ విదేశాంగ మంత్రి ఎమిన్ డ్జపరోవా మంగళవారం క్షమాపణలు చెప్పారు. తమ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ కాళీమాతను వికృతంగా చిత్రీకరించినందుకు ఉక్రెయిన్ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తోందని తెలిపారు. ‘‘ మేము ప్రత్యేకమైన భారతీయ సంస్కృతిని గౌరవిస్తున్నాం. భారతదేశం నుంచి వస్తున్న మద్దతును చాలా ప్రశంసిస్తున్నాం’’ఎమిన్ డ్జపరోవా ఓ ట్వీట్ లో పేర్కొన్నారు.
కాళీ మాతను అసభ్యకర రీతిలో ప్రొజెక్ట్ చేస్తూ ఉక్రెయిన్ మంత్రిత్వ శాఖ భారతీయుల ఆగ్రహానికి కారణమైన మరుసటి రోజే ఎమిన్ డ్జపరోవా ఈ ట్వీట్ రావడం గమనార్హం. ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ చేసిన ట్వీట్ ను ఇప్పుడు తొలగించింది. ఆ ట్వీట్ లో ‘‘వర్క్ ఆఫ్ ఆర్ట్’’ అనే క్యాప్షన్ తో కాళీ దేవీ ఫొటోను పేలుడు పొగపై అతికించారు.
అయితే ఈ ట్వీట్ పై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని హిందువుల మనోభావాలపై దాడిగా అభివర్ణించారు. ఈ ఫొటోపై ఉక్రెయిన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన పలువురు నెటిజన్లలో గుప్తా కూడా ఉన్నారు.
హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడితే కాల్చి చంపేస్తాం - కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..
భారత్ సాయం కోరిన ఉక్రెయిన్ ప్రభుత్వం.. తమ దేశంలో విస్తృతంగా ఆరాధించే దేవతను అవమానిస్తోందని పలువురు నెటిజన్లు నిన్న విమర్శించారు. నీలి రంగు చర్మం, నాలుకను బయటపెట్టిన భంగిమ, మెడ చుట్టూ పుర్రెల దండతో అచ్చుగుద్దినట్లు కాళీమాతను పోలినట్లుగా వున్న ఆ వ్యంగ్య చిత్రం హిందూ సంస్కృతిని అపహాస్యం చేసేలా వుందంటూ భారతీయులు ఉక్రెయిన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమిన్ డ్జపరోవా భారత్ లో పర్యటించిన కొద్ది రోజులకే రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ట్వీట్ చేసింది. 2022 ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత భారత్లో పర్యటించిన తొలి ఉక్రెయిన్ ఉన్నతాధికారి ఆమె. ఆ సమయంలో ఆమె రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ జోక్యం చేసుకోవాలని కోరుతూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖను ఎమిన్ కేంద్రమంత్రి మీనాక్షి లేఖిని కలిసి అందజేశారు.