అమెరికాలో టోర్నడో విధ్వంసం.. 23 మంది దుర్మరణం.. యాక్షన్లోకి రెస్క్యూ టీమ్లు
అమెరికాలోని మిస్సిసిపి రాష్ట్రంలో టోర్నడోలు విధ్వంసం సృష్టించాయి. కనీసం 23 మంది మరణించారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు చెబుతున్నారు.
న్యూఢిల్లీ: అమెరికాలో టోర్నడోలు విధ్వంసం సృష్టించాయి. కొన్ని వందల కిలోమీటర్ల మేరకు పట్టణాలకు పట్టణాలే భూస్థాపింత అయ్యాయి. ఇళ్లు కూలిపోయాయి. వాహనాలు చెల్లాచెదురైపోయాయి. కనీసం 23 మంది ఈ టోర్నడోల శరాఘాతానికి దుర్మరణం చెందారు. అమెరికాలోని మిస్సిసిపీలో శుక్రవారం రాత్రి ఈ టోర్నడోల బీభత్సం మొదలైంది. ఈ టోర్నడోల కారణంగా కొన్ని వందల కిలోమీటర్ల మేరకు మొత్తం విధ్వంసమే కనిపిస్తున్నదని స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ తెలిపింది.
పశ్చిమ మిస్సిసిపీలోని సిల్వర్ సిటీ అనే పట్టణంలో నలుగురు ఈ టోర్నడోల కారణంగా కనిపించకుండా పోయారు. రెస్క్యూ టీమ్ వారి కోసం గాలిస్తున్నది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ పేర్కొంది. 1,700 మంది నివసించే రోలింగ్ ఫోర్క్ అనే పట్టణంలోనూ సెర్చ్, రెస్క్యూ టీమ్ పనిలో నిమగ్నమైంది.
ఇలాంటి వైపరిత్యాన్ని తాను ఎప్పడూ చూడలేదని బ్రాండీ షోవా అనే స్థానికుడు సీఎన్ఎన్కు తెలిపాడు. ఇది చాలా చిన్న పట్టణం అని, ఇప్పుడు ఇది కనిపించకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ బంధువులూ ఈ ప్రకృతి విపత్తును ఎదుర్కొన్నారని, తన మిత్రులు కొన్ని ఇళ్లల్లో చిక్కుకుపోయారని వివరించాడు.
రోలింగ్ ఫోర్క్ పట్టణంలో అధిక నష్టం సంభవించింది. ఇప్పటికీ చాలా మంది ఇంకా వారి వారి ఇళ్లల్లోనే చిక్కుకుని ఉన్నారని యునైటెడ్ కాజన్ నేవీ ప్రెసిడెంట్ టాడ్ టెర్రెల్ తెలిపారు.
శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు టోర్నడోల గురించి నేషనల్ వెదర్ సర్వీస్ 24 రిపోర్టులను ప్రచురించింది. ఈ రిపోర్టుల్లో ప్రధానంగా మిస్సిసిపిలో టోర్నడోల విధ్వంసం ఉండే అవకాశం ఉన్నదని, అలబామాలోనికీ ఇవి వెళ్లే ప్రమాదం ఉన్నదని ఆ రిపోర్టులు వివరించాయి.
చాలా మంది మిస్సిసిపిలో టోర్నడోలు సృష్టించిన విధ్వంసాలను సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోల రూపంలో పోస్టు చేశారు.