శ్రీలంకను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు, అలాగే దేశంలో పరిపాలన సజావుగా నిర్వహించేందుకు శ్రీలంక అధ్యక్షుడు తన కేబినెట్ ను విస్తరించారు. కొత్తగా 17 మందికి స్థానం కల్పించారు. ఇటీవల ప్రధానమంత్రి మినహా రాజపక్స మంత్రి వర్గం మొత్తం రాజీనామా చేసింది. 

శ్రీలంక‌ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దీంతో దేశంలో ప్ర‌భుత్వ వ్య‌తిరేక నిర‌స‌న‌లు కొన‌సాగుతున్నాయి. రాజ‌కీయ సంక్షోభం కూడా ఏర్ప‌డింది. వీటి అన్నింటిని అరిక‌ట్టేందుకు, ప‌రిపాల‌న స‌జావుగా సాగించేందుకు శ్రీలంక అధ్య‌క్షుడు గోటబయ రాజపక్సే కేబినెట్ లోకి 17 మందిని తీసుకున్నారు. వీరంతా సోమ‌వారం రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణస్వీకారం చేశారు.

ప్రెసిడెంట్ రాజపక్సేగా బాధ్య‌తలు చేప‌ట్టిన త‌రువాత ఇది మూడో కేబినెట్ విస్త‌ర‌ణ‌. ఈ కొత్త కేబినెట్‌లో ఎనిమిది మంది మాజీ మంత్రులు ఉండగా, ఇందులో పలువురు కొత్త ముఖాలు కూడా ఉన్నాయ‌ని కొలంబో పేజ్ నివేదించింది.

శ్రీలంక చ‌రిత్ర‌లో అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభం ఏర్ప‌డ‌టంతో ఏప్రిల్ 3వ తేదీన ప్రధాన మంత్రి మహింద రాజపక్స మినహా 26 మంది మంత్రులతో కూడిన మొత్తం మంత్రివర్గం వారి సంబంధిత శాఖలకు రాజీనామా చేసింది. దీంతో మరుసటి రోజు ప్రెసిడెంట్ రాజపక్సే పార్లమెంటు, ఇతర కార్యక్రమాల చట్టబద్ధత, స్థిరత్వాన్ని నిర్వహించడానికి నలుగురు మంత్రులను నియమించారు. 

శ్రీలంక దేశం చెత్త ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆహారం, ఇంధన కొరత, పెరుగుతున్న ధరలు, విద్యుత్ కోతలు పెద్ద సంఖ్యలో ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి, ఫలితంగా ప్రభుత్వంపై భారీ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. COVID-19 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి శ్రీలంక ఆర్థిక వ్యవస్థ స్వేచ్ఛా పతనంలో ఉంది, ఇది పర్యాటక రంగం పతనానికి దారితీసింది. శ్రీలంక విదేశీ మారకద్రవ్య కొరతను కూడా ఎదుర్కొంటోంది. 

విదేశీ మార‌క ద్ర‌వ్యం కొర‌త ఏర్ప‌డ‌టంతో ఆహారం, ఇంధనం, మెడిసిన్ దిగుమ‌తిపై తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. దీంతో శ్రీలంక మిత్ర దేశాల నుంచి అవ‌స‌ర‌మైన వ‌స్తువుల‌ను సాయం కోరాల్సి వ‌స్తోంది. ఆర్థిక పరిస్థితి కారణంగా ప్రధాని మహింద రాజపక్స, అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయాలనే డిమాండ్లతో భారీ నిరసనలు వెల్లువెత్తాయి. అంతకు ముందు ప్రధాని మహీందా రాజపక్స జాతిని ఉద్దేశించి ప్రత్యేకంగా ప్రసంగించారు. ప్ర‌జలు ఓపిక ప‌ట్టాల‌ని కోరారు. ఈ ప‌రిస్థితి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌ని, ప్ర‌జ‌లు వీధుల్లోకి రావ‌డం మానేయాల‌ని అభ్యర్థించారు.

ఇదిలా ఉండ‌గా.. ఆర్థిక సంక్షోభం నేప‌థ్యంలో శ్రీలంక ప్రభుత్వ యాజమాన్యంలోని పెట్రోలియం కంపెనీ వాహనాలకు ఇంధన కోటాను నిర్ణయించింది. గ‌త శుక్రవారం నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ (CPC) ప్రకటన ప్రకారం, ఇప్పుడు మోటార్‌సైకిళ్లు మరియు ఇతర ద్విచక్ర వాహనాలు ఏ ఇంధన స్టేషన్‌లోనైనా రూ.1,000 వరకు మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయాలి. అదేవిధంగా మూడు చక్రాల వాహనాలు రూ.1500, కార్లు, జీపులు, వ్యాన్‌లు రూ.5వేలకు ఇంధనాన్ని కొనుగోలు చేయవచ్చు. బస్సులు, లారీలు, వాణిజ్య వాహనాలకు కోటా విధానం నుండి మినహాయింపు ఇచ్చారు. 

కాగా ఆర్థిక సంక్షోభంతో కొట్టు మిట్టాడుతున్న శ్రీలంక సాయం చేస్తామ‌ని భార‌త్ ప్ర‌క‌టించింది. మ‌న దేశం 2 బిలియన్ల డాల‌ర్ల వ‌ర‌కు ఆర్థిక సాయం చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ విష‌యాన్ని భార‌త అధికార వ‌ర్గాలు ఇటీవ‌లే వెల్ల‌డించాయి. ‘‘ మేము ఖచ్చితంగా శ్రీలంక‌కు సహాయం చేయడానికి చూస్తున్నాము. మ‌రిన్ని స్వాప్ లైన్లు, రుణాలను అందించడానికి సిద్ధంగా ఉన్నాము‘‘ అని శ్రీలంకతో జ‌రిగిన వివిధ చర్చల అనంత‌రం అధికారులు పేర్కొన్నారు.