Texas School Shooting : తుపాకీ సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడాలి.. జో బిడెన్ పిలుపు..
విషాదకరమైన టెక్సాస్ స్కూల్ కాల్పుల ఘటన తర్వాత అమెరికా గన్ లాబీయిస్టులపై చర్యలు తీసుకోవాలని అధ్యక్షుడు జో బిడెన్ పిలుపునిచ్చారు.
వాషింగ్టన్ : Texas ఎలిమెంటరీ స్కూల్లో మంగళవారం ఒక సాయుధుడు కాల్పులు జరిపిన ఘటనలో 21 మందికి పైగా మరణించిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు Joe Biden "తుపాకీలపై కొత్త ఆంక్షలు" అంటూ ఉద్వేగభరితమైన పిలుపు ఇచ్చారు. "దేవుని పేరు మీద మనం ఎప్పుడు US gun lobbyలకు ఎదురు నిలబడబోతున్నాం" అని బిడెన్ ఐదు రోజుల ఆసియా పర్యటన నుండి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే వైట్ హౌస్ వద్ద చెప్పారు,
రూజ్వెల్ట్ రూమ్లో ప్రథమ మహిళ జిల్ బిడెన్ తన పక్కన నిలబడి ఉండగా, జో బిడెన్ ఇలా అన్నాడు, “నాకు ఇది చాలా నీరసాన్ని, అలసటను కలిగించింది. దీని మీద చర్య తీసుకోవాలి. ”ఈ విషాద ఘటనలో ఒక ఉపాధ్యాయుడితో పాటు కనీసం 21 మంది విద్యార్థులు చనిపోయారని నాకు తెలిపారు.
బిడెన్ తన పర్యటనకు బయలుదేరడానికి రెండు రోజుల ముందు, న్యూయార్క్లోని బఫెలోలో ఒక కిరాణా దుకాణంలో 10 మంది నల్లజాతీయులను ఒకరు కాల్చి చంపారు. ఆ బాధితుల కుటుంబాలను బైడెన్ కలిశారు. ఈ ఘటనలు ఇలా బ్యాక్-టు-బ్యాక్ జగరడం బాధాకరం అన్నారు. తుపాకీ సంస్కృతి అమెరికాలో అంటువ్యాధిలా పాకుతోందని.. క్రూరత్వాన్ని ప్రేరేపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
"ఈ రకమైన సామూహిక కాల్పులు ప్రపంచంలో మరెక్కడా జరగవు. చాలా అరుదుగా జరుగుతాయి," అని బిడెన్ అన్నాడు. అమెరికాలోనే "ఎందుకు" అని ప్రశ్నించారు. టెక్సాస్లో చనిపోయిన బాధితుల గౌరవార్థం శనివారం సూర్యాస్తమయం వరకు అమెరికన్ జెండాలను సగం స్టాఫ్లో ఎగురవేయాలని ఆయన ఆదేశించారు.
అంతకుముందు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మాట్లాడుతూ, ఇలాంటి సమయాల్లో ప్రజలు చాలా భయాందోళనల్లో ఉంటారు. చాలామంది ఈ ఘటనతో తమ హృదయాలు బరువెక్కాయని చెబుతుంటారు. కానీ బాధిత కుటుంబాల బాధ ముందు అది ఎంత? అందుకే ఇలాంటి సంస్కృతిని ఆపడానికి నిందితుల మీద చర్య తీసుకోవడానికి ధైర్యం కలిగి ఉండాలి.. అని ఆమె చెప్పారు
వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ మాట్లాడుతూ, బిడెన్కి డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జెన్ ఓ'మల్లే-డిల్లాన్, ఎయిర్ ఫోర్స్ వన్లోని అతని సీనియర్ టీమ్లోని ఇతర సభ్యులు కాల్పుల గురించి వివరించారని చెప్పారు. వాషింగ్టన్లో దిగడానికి కొద్దిసేపటి ముందు, బిడెన్ అధ్యక్ష విమానం నుండి టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్తో మాట్లాడాడు, ‘టిఎక్స్లోని ఉవాల్డేలో జరిగిన భయంకరమైన కాల్పుల నేపథ్యంలో అన్ని రకాల సహాయాన్ని అందించడానికి తన అవసరం ఉంటే వెంటనే చెప్పాలని’ వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ కేట్ బెడింగ్ఫీల్డ్ ట్వీట్ చేశారు.
కాగా, అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. టెక్సాస్లోని ఒక ఎలిమెంటరీ స్కూల్లో 18 ఏళ్ల యువకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 18 మంది విద్యార్థులతో సహా 21 మంది మృత్యువాత పడ్డారు. మృతి చెందిన విద్యార్థుల వయసు నాలుగు నుంచి 14 ఏళ్ల మధ్య ఉంటుందని అక్కడి అధికారులు తెలిపారు. గత కొన్నేళ్లలో ఇది అత్యంత ఘోరమైన సంఘటన అని ఆ రాష్ట్ర గవర్నర్ గ్రేగ్ అబాట్ వెల్లడించారు. మెక్సికన్ సరిహద్దుల్లోని ఉవాల్డేలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత పోలీసుల కాల్పుల్లో దుండగులు చనిపోయాడు. అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం సమయంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి.