ఆ ముస్లిం యోధుడు.. సోమనాథ్ ఆలయ విగ్రహాలను ధ్వంసం చేశాడు.. తాలిబాన్ నేత ట్వీట్.. ఇండియన్స్ ఫైర్
సుల్తాన్ మహ్మద్ గజనవీ ముస్లిం యోధుడు అని, ఆయన సోమనాథ్ ఆలయ విగ్రహాలను, ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడని తాలిబాన్ నేత అనాస్ హక్కానీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్పై భారతీయులు తీవ్రంగా మండిపడ్డారు. పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయ చిత్రాలను పోస్టు చేసి జవాబిచ్చారు.
న్యూఢిల్లీ: ఇన్నాల్లు పొరుగున ఉన్న పాకిస్తాన్ దేశం భారత్పై తరచూ అక్కసు వెళ్లగక్కేది. సమయం దొరికినప్పుడల్లా బురద జల్లేది. ఇప్పుడు ఈ దేశానికి తోడు afghanistanలోని taliban ప్రభుత్వమూ జతకట్టింది. indianల మనోభావాలను దెబ్బతీసేలా తాలిబాన్ నేతలు ప్రవర్తిస్తున్నారు. తాజాగా హిందువుల భావాలను రెచ్చగొట్టే ట్వీట్ చేశారు. దీనిపై ఆగ్రహించిన భారతీయులు తాలిబాన్ నేతలపై దుమ్మెత్తిపోశారు.
తాలిబాన్ లీడర్ అనాస్ హక్కానీ మంగళవారం mahmud ghaznavi సమాధిని సందర్శించాడు. ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత భద్రతా మంత్రి సిరాజుద్దీన్ హక్కాని తమ్ముడే ఈ anas haqqani. ఆయన మహ్మద్ గజనవీ సమాధిని సందర్శించి ఆయనపై ప్రశంసలు చేశారు.
‘ఈ రోజు సుల్తాన్ మహ్మద్ గజనవీ సమాధిని సందర్శించాను. ఆయన ముస్లిం యోధుడు. 10వ శతాబ్దపు ముజాహిద్. గజనీ మొదలు గజనవీలు ఈ ప్రాంతంలో బలమైన ముస్లిం రాజ్యాన్ని స్థాపించారు. సోమనాథ్ ఆలయ విగ్రహాలను ధ్వంసం చేశారు’ అని ట్వీట్ చేశారు. దీనికి తోడు సమాధి చిత్రాలనూ జతచేశారు.
మహ్మద్ గజనీ గజనవీ వంశపాలనను స్థాపించాడు. క్రీస్తుశకం 998 నుంచి క్రీస్తు శకం 1030 వరకు ఈ వంశం పాలించింది. మహ్మద్ గజనవీ గుజరాత్లోని సోమనాథ్ ఆలయాన్ని సుమారు 17సార్లు దాడి చేసినట్టు చరిత్ర చెబుతున్నది. చివరికి క్రీస్తు శకం 1024లో పూర్తిగా ధ్వంసం చేశారు. గజనవీ ప్రత్యేకంగా హిందు ఆలయాలను టార్గెట్ చేసి అక్కడ భద్రపరిచే సంపదను కొల్లగొట్టేవాడు.
మహ్మద్ గజనవీని పొగుడుతూ అనాస్ హక్కానీ చేసిన ట్వీట్లపై కొందరు భారతీయులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికీ సోమనాథ్ ఆలయం పవిత్రంగా ఉన్నదని, కానీ, గజనవీ, ఘోరీ, గజనీ, తైమూర్ నగరాలే పేదరికం, ఆకలి కేకలతో అలమటిస్తున్నాయని ట్వీట్లు చేశారు. పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయ చిత్రాలను పోస్టు చేశారు.
దేశ తొలి హోం మంత్రి సర్దార్ వల్లభ్బాయ్ పటేల్ gujaratలో సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించాలని ఆదేశించారు. ఆయన మరణం తర్వాత 1951 మేలో ఈ ఆలయ నిర్మాణం పూర్తయిన సంగతి తెలిసిందే.