ఆఫ్గాన్లో సిక్కులు, హిందువులపై ఉగ్రదాడి; 19 మంది మృతి!
ఆఫ్ఘానిస్థాన్లో దారుణానికి పాాల్పడిన ఉగ్రవాదులు
కాబూల్:
అఫ్ఘానిస్థాన్లో ఉగ్రవాదులు మరోసారి మారణహోమం సృష్టించారు. అఫ్ఘానిస్థాన్లోని మైనారిటీ సిక్కులను, హిందువులను టార్గెట్ చేస్తూ ఆత్మాహుతి దాడి జరిపారు. జలాలాబాద్ నగరంలో జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో 19 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. మరణించిన వారిలో ఎక్కువ మంది సిక్కులు, హిందువులే ఉన్నారు.
నంగర్హర్ ప్రావిన్సులో పర్యటిస్తున్న అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీని కలిసేందుకు వీరంతా ఒక వాహనంలో ప్రయాణిస్తుండగా ఈ ఆత్మాహుతి దాడి జరిగిందని పోలీసులు వివరించారు. ఆష్రఫ్ ఈ ప్రాంతంలో హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చారు. అనంతరం అక్కడి ప్రాంతీయ గవర్నర్ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. అదే సమయంలో అక్కడికి కొద్దిదూరంలోనే ఉన్న మార్కెట్లో దుండగుడు తనను తాను పేల్చుకున్నాడు.
కాగా.. అఫ్గాన్ పార్లమెంటుకు ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన ఏకైక సిక్కు అభ్యర్థి అత్వార్ సింగ్ ఖల్సా కూడా ఈ ఆత్మాహుతి దాడిలో చనిపోయారు. ఈ దాడికి బాద్యత వహిస్తున్నట్లు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ప్రకటించింది. ఈ దాడిని కాబూల్లోని భారత రాయబార కార్యాలయం ఖండించింది. ఇది ‘పిరికిపందలైన ఉగ్రవాదుల’ చేసిన దాడి అని అభివర్ణించింది.