సెంట్రల్ ప్యారిస్లో కాల్పులు, ముగ్గురు మృతి.. అనుమానితుడి అరెస్ట్..
సెంట్రల్ ప్యారీస్ లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. 60యేళ్ల వ్యక్తి జరిపిన తుపాకీ దాడిలో మరికొంతమంది గాయపడ్డారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
ప్యారిస్ : సెంట్రల్ ప్యారిస్లో కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, దాడి వెనుక ఉద్దేశం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. సెంట్రల్ ప్యారిస్లో శుక్రవారం జరిగిన కాల్పుల ఘటనలో కనీసం ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు.
వివరాల ప్రకారం, కుర్దిష్ సాంస్కృతిక కేంద్రం పరిసరాల్లో కాల్పుల ఘటన జరిగినట్లు ఫ్రెంచ్ టెలివిజన్ నెట్వర్క్ బీఎఫ్ఎమ్ టీవీ నివేదించింది. ఈ సంఘటనను పారిస్ సిటీ హాల్లోని సీనియర్ ఒకరు ధృవీకరించారు.
కాల్పులపై డిప్యూటీ మేయర్ ఇమ్మాన్యుయేల్ గ్రెగోయిర్ ట్వీట్ చేస్తూ.. ‘"గన్ ఎటాక్ జరిగింది. అయితే, అత్యంత వేగంగా స్పందించినందుకుభద్రతా దళాలకు ధన్యవాదాలు" అన్నారు. ఈ ఘటనలో బాధితులైన వారు, ఈ సన్నివేశాన్ని చూసి భయాందోళనలకు గురైనవారి పరిస్థితి గురించి ఆలోచిస్తున్నాను.. అన్నారాయన..
ఘటన తర్వాత దృశ్యాల వీడియోను స్థానిక జర్నలిస్టు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పారిస్ పోలీసులు రూ డి ఎన్గిన్లో జరిగిన సంఘటనను అదుపులోకి తెచ్చారని, ఆ పరిసర ప్రాంతానికి దూరంగా ఉండాలని ప్రజలను కోరారు. అనుమానిత సాయుధుడు 60 ఏళ్ల వయస్సు వాడని, అతడిని అరెస్టు చేసినట్లు బీఎఫ్ఎమ్ టీవీ తెలిపింది. అయితే అతను ఎందుకు ఈ కాల్పులకు దిగాడో స్పష్టంగా తెలియలేదు. గన్ తో కాల్పులు జరుపుతూ వీధిలో అల్లకల్లోలం సృష్టించాడని, ఏడెనిమిది రౌండ్ల కాల్పులు జరిగాయని ఒక సాక్షి తెలిపారు.